Share News

భూసమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు

ABN , Publish Date - May 10 , 2025 | 12:21 AM

గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా వస్తున్న భూసమస్యల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఎలిగేడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం సందర్శించారు.

భూసమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు
తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

ఎలిగేడు, మే 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా వస్తున్న భూసమస్యల పరిష్కారానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. ఎలిగేడు తహసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు మండలం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు. భూభారతి చట్టం కింద భూసమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని, గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మే 19 వరకు ఉన్న షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. భూరికార్డుల సమస్యలు ఉంటే ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎలిగేడు మండలంలో ఇప్పటివరకు 614 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజలనుంచి వచ్చే దరఖాస్తులను ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా పరిష్కరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, కోర్టు సమస్యలు, కుటుంబ వివాదాలు మినహాయించి మిగిలిన భూసమస్యలను జూన్‌ 2లోపు పరిష్కరించేలా కార్యచరణ అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌ బషురోద్దీన్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై జిల్లాలోని ఎలిగేడు మండలంను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈనెల 5వ తేదీన ప్రారంభమైన రెవెన్యూ సదస్సులో ఇప్పటివరకు ఎలిగేడులో 181, బురహాన్‌మియాపేటలో 96, లాలపల్లిలో 105, నర్సాపూర్‌లో 145, నారాయణపల్లిలో 46, సుల్తాన్‌పూర్‌లో 53, ధూళికట్టలో 55చొప్పున రైతులు భూసమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందజేశారు.

Updated Date - May 10 , 2025 | 12:21 AM