కార్మికుల హక్కుల కాలరాస్తే బీజేపీ పతనం తప్పదు
ABN , Publish Date - May 02 , 2025 | 12:49 AM
కార్మికుల హక్కులు కాలరాస్తే బీజేపీ పతనం తప్పదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు.
- సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి
భగత్నగర్, మే 1 (ఆంధ్రజ్యోతి): కార్మికుల హక్కులు కాలరాస్తే బీజేపీ పతనం తప్పదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా కరీంనగర్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశపెట్టిందన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న జాతీయ సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మేడే దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వే హమాలీ సంఘం కార్మికులు ఏర్పాటు చేసిన జెండాను, కూరగాయల మార్కెట్ వద్ద ఉల్లిగడ్డల హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను చాడ వెంకట్రెడ్డి ఆవిష్కరించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన పతాకాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఆవిష్కరించారు. సిమెంట్ గోదాం, ఫర్టిలైజర్ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాలను ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్నయాదవ్ ఆవిష్కరించారు.
ఫ భారీ బైక్ ర్యాలీ
కరీంనగర్లో మేడే వేడుకల్లో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వే కార్మికులు నిర్వహించిన బైక్ ర్యాలీలో చాడ వెంకట్రెడ్డి స్వయంగా బైక్ నడుపుతూ కార్మికుల్లో ఉత్సాహం నింపారు. జెండా అవిష్కరణ అనంతరం రైల్వే గేట్ నుంచి సుభాష్నగర్, మంచిర్యాల చౌరస్తా, గాంధిరోడ్, రాజీవ్చౌక్, టవర్సర్కిల్, కూరగాయల మార్కెట్, కమాన్చౌరస్తా మీదుగా బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.