పదో తరగతి బాలికలందరికీ సైకిళ్లు
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:35 AM
పదో తరగతి బాలికలందరికీ సైకిళ్లు అందిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం నగరంలోని టీఎన్జీవో హాలులో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా వంద మంది బాలికలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు.

భగత్నగర్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి బాలికలందరికీ సైకిళ్లు అందిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం నగరంలోని టీఎన్జీవో హాలులో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా వంద మంది బాలికలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు భారం కాదని, కుటుంబానికి సమాజానికి భరోసా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కిశోరశక్తి, బేటీ బచావో బేటీ పడావో, జన్మోత్సవ్, ముద్ర యోజన వంటి పథకాలు ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివే ఆడ పిల్లలకు సైకిళ్లు అందిస్తామన్నారు. బాలికల వసతి గృహాల్లో వాషింగ్ మిషన్లు అందిస్తాన్నారు. పథకాల లక్ష్యాన్ని చేరే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బేటీ పడావో పథకంలో భాగంగా పాఠశాలకు దూరంగా ఉండి సైకిల్ లేని వారిని గుర్తించి వంద మందికి సైకిల్ అందజేస్తున్నామన్నారు. ఇందులో 30 సైకిళ్లను స్టేట్బ్యాంక్ఆఫ్ ఇండియా అందజేసింద న్నారు. జిల్లాలో స్నేహిత కార్యక్రమం ద్వారా కెరియర్ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సంక్షేమ పథకాలపై బాలికలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంథుల పాఠశాలలో వాషింగ్ మిషన్లు అందించామన్నారు. జిల్లాలో పదో తరగతి మధ్యలో ఆపేసిన 110 మంది విద్యార్థులను గుర్తించి వారందరికీ పరీక్ష రాయించామన్నారు. 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. మహిళా సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం సభ నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఆడపిల్లల స్వీయ రక్షణకు పోలీస్ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆడపిల్లలకు విద్య ఎంతో అవసరమని, చదువుతో బాలికలు తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన నాటికలు, నృత్యాలు, గేయాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ శోభారాణి, జిల్లా సంక్షేమాధికారి సబిత, ఎస్బీఐ ఏజీఎం ఎస్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.