Share News

నేడు బీసీ బంద్‌

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:10 AM

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్‌కు బీసీ జేఏసీ సన్నాహక సమావేశాలతో అన్నివర్గాల మద్దతను కూడగట్టింది. ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ నినాదంతో జనాభా దామాషా ప్రకారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ ఐక్యవేదిక ఇచ్చిన శనివారం రాష్ట్ర వ్యాప్తబంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలు, టీజేఎస్‌, జాగృతితో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

నేడు బీసీ బంద్‌

- అన్ని కుల, రాజకీయ పార్టీల మద్దతు

- సంఘీభావం ప్రకటించిన ‘ట్రస్మా’

- సన్నాహాక సమావేశాలతో మద్దతు కూడగడుతున్న బీసీ జేఏసీ

కరీంనగర్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్‌కు బీసీ జేఏసీ సన్నాహక సమావేశాలతో అన్నివర్గాల మద్దతను కూడగట్టింది. ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ నినాదంతో జనాభా దామాషా ప్రకారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో బీసీ ఐక్యవేదిక ఇచ్చిన శనివారం రాష్ట్ర వ్యాప్తబంద్‌కు కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, వామపక్ష పార్టీలు, టీజేఎస్‌, జాగృతితో పాటు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ట్రస్మా), ప్రైవేట్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కూడా బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. అలాగే బీసీల ఐక్యతను చాటే విధంగా అన్నికుల సంఘాలు సమావేశాలను ఏర్పాటు చేసుకొని బీసీ బందుకు మద్దతునిస్తూ తీర్మానించాయి. జిల్లా బీసీ సంఘాల జేఏసీ నాయకులు రాజకీయ పార్టీల నాయకులను, ప్రజాప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల అధినేతలను కలిసి బంద్‌కు సహకరించాలని కోరారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. 42శాతం బీసీ రిజర్వేషన్‌పై కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి శనివారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. బీసీ బంద్‌కు బీజేపీ మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి 42శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ సంఘీభావంగా బంద్‌లో పాల్గొనాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా జీవో 9 కోర్టులో నిలువదని, 42శాతం రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్‌ పార్టీ బీసీలను మోసం చేస్తోందని, పార్లమెంట్‌లో చట్టం తెచ్చేందుకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్టీశ్రేణులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తే అన్ని పార్టీలు మద్దతునిచ్చాయని, జీవో 9 విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ద్వంద వైఖరితో వ్యవహ రించి 42శాతం రిజర్వేషన్లు అడ్డుకున్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తూ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావం ప్రకటించాయి. అలాగే మిగిలిన అన్ని పార్టీలు, కుల సంఘాలు, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ సహకారాన్ని ఇవ్వడంతో బంద్‌ విజయవంతమవుతుందని జేఏసీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 01:10 AM