మానేరు రివర్ఫ్రంట్ అవినీతిపై విచారణ చేపట్టాలి
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:05 AM
కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి వితిన పత్రం సమర్పించారు.
భగత్నగర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి వితిన పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రివర్ ఫ్రంట్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. అందులో టూరిజం శాఖ 100 కోట్లు, నీటి పారుదల శాఖ 100 కోట్లు విడుదల చేసిందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ పనుల నిర్మాణాన్ని చేపట్టిందని, బీఆర్ఎస్ నాయకుల అనుచరులకు అప్పగించారని తెలిపారు. వారు పనులు పూర్తి చేయలేదన్నారు. చేసిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు లోపించాయన్నారు. కొంత మేర బిల్లులు చెల్లించినప్పటికీ నిర్మాణ పనుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. రివర్ఫ్రంట్ పరిధిలో నాణ్యత లేకుండా చెక్ డ్యాంలు నిర్మిస్తే అవి వర్షాకాలంలో కొట్టుకుపోయాయని తెలిపారు. రివర్ ఫ్రంట్ పనుల్లో అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంను కోరారు.