‘అమృత్’ పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:30 AM
అమృత్ పథకం నిధులతో చేపడుతున్న మంచినీటి అభివృద్ధి పనులన్నింటిని త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్ అధికారులను ఆదేశించారు.
- రెండు రోజుల్లో సంపు నిర్మాణం పనులు ప్రారంభించండి
- మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): అమృత్ పథకం నిధులతో చేపడుతున్న మంచినీటి అభివృద్ధి పనులన్నింటిని త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్దేశాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మానేరు డ్యాం సమీపంలోని మంచినీటి శుద్దీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ మంచినీటి సరఫరాకు సంబంధించిన బూస్టర్ పంపుహౌస్ వాల్స్ రిపేర్స్, పైపులైన్ లీకేజీకి సంబంధించిన పనులు చేపట్టాలని ఆదేశించారు. మెటీరియల్తోపాటు లేబర్లను ముందే సమకూర్చుకోవాలని అన్నారు. అమృత్లో భాగంగా నిర్మిస్తున్న 10 ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్ పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. 14, 34 ఫిల్టర్ల నుంచి వచ్చిన బ్యాక్ వాషింగ్ వాటర్ను తిరిగి ఉపయోగించేందుకు వీలుగా రెండురోజుల్లో సంపు నిర్మాణ పనులను ప్రారంభించాలన్నారు. వాటర్ పైపులైన్ పంపులు, వాల్స్, ఇతర మరమ్మతు పనులకు సంబంధించి అంచనాలు తయారు చేసి పనులను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ రొడ్డ యాదగిరి, సంజీవ్కుమార్, డీఈ దేవేందర్, ఫిల్టర్ బెడ్ సిబ్బంది పాల్గొన్నారు.