బీసీలందరూ ఏకమై పోరాడాలి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:54 PM
రిజర్వేషన్లపై బీసీలు అందరూ ఏకమై పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ పేర్కొన్నారు.
గణేశ్నగర్,అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై బీసీలు అందరూ ఏకమై పోరాడాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ చౌక్లో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు ఆడ్డుకున్నారు. అనంతరం బీసీ సంఘం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి సంఘం కోర్టుకు వెళ్లడం దారుణమని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం కల్పిస్తే బీసీలు వ్యతిరేకించలేదన్నారు. 8శాతం లేని వాళ్లకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా బీసీ సంఘాలు ఆందోళనలు చేయలేదన్నారు. 52శాతం పైగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో కల్పిస్తే కోర్టులో కేసు వేసి బీసీల నోట్లో మన్ను కొట్టారన్నారు. దీనిపై బీసీలందరూ ఒకటై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్, రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శి రంగు సంపత్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, విద్యార్థి సంఘం అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాచర్ల అంజయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్ , జిల్లా ఉపాధ్యక్షులు మంతెన కిరణ్, బోయిని ప్రశాంత్, బియ్యం తిరుపతి, జీఎస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.