రైస్మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:06 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న రైస్మిల్లర్లపై కలెక్టర్ చర్యలు తీసుకుని రైతాంగానికి సహకరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న రైస్మిల్లర్లపై కలెక్టర్ చర్యలు తీసుకుని రైతాంగానికి సహకరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్లోని అమృత్లాల్శుక్లా కార్మిక భవనంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐకేపీ సెంటర్లల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని కోరారు. రైస్మిల్లర్లు రైతుల వద్ద నుంచి ప్రతి సంచికి రెండునుంచి మూడు కిలోలు అదనంగా ధాన్యం తీసుకుంటూ దోపిడీకి గురిచేస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో సేకరించిన సన్నబియ్యానికి బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందించాలని అలాగే ధాన్యం కొనుగోలు అలస్యం వల్ల రైతులు వర్షాల భయంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రైవేటు వ్యాపారుల తేమ పేరుతో ఒక క్వింటాల్కు 8కిలోల వరకు కోతలు విధిస్తూ రైతు లను నిలువునా దోపిడీ గురిచేస్తున్నారని అరోపించారు. ఇలాంటి మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైస్మిల్లర్ల లైసెన్స్లను రద్దు చేయాలని డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జివ్వాజి విమల, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.