ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:15 AM
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని,ఈ విద్యాసంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కరీంనగర్, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని,ఈ విద్యాసంవత్సరంలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో విద్యాశాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వయసుకు మించి బ్యాగుల భారం మోస్తున్నారని, గంగాధర మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానం ద్వారా బ్యాగుల బరువు తగ్గించాలని సూచించారు. స్నేహిత, మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలను నియమించాలని, ఇంగ్లీష్ క్లబ్ ప్రతి పాఠశాలలో అమలు చేయాలన్నారు. ప్రతి పాఠశాలను సందర్శించి ల్యాబ్ తీరు పరిశీలించాలని జిల్లా సైన్స్ అధికారిని ఆదేశించారు. ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలని సూచించారు. సమావేశంలో డీఈవో చైతన్య జైనీ, కో-ఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
ఫ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి
తిమ్మాపూర్: ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, విద్యార్ధులు పుస్తకాలు చదువుకునేందుకు ప్రతిరోజు 45 నిమిషాల సమయం కేటాయించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మండలంలోని మహత్మానగర్ ఎల్ఎండీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒక గదిని గ్రంథాలయానికి కేటాయించాలన్నారు. గది ఖాళీ లేకపోతే ఒక కార్నర్లో గ్రథాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
ఎరువుల దుకాణాదారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చారించారు. కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలోని అలుగునూర్ కామన్ సర్విస్ సెంటర్, శ్రీరామ ఫెర్టిలైజర్ దుకాణంలో కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎరువుల నిల్వలు, కొనుగోళ్ల రిజిస్టర్ను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సబ్సిడీ ఎరువులను దారి మళ్లించినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాదారులు ఏ రైతుకు ఎంత పరిమాణంలో ఎరువులు ఇస్తున్నారనే వివరాలు తప్పక నమోదు చేయాలని సూచించారు. ఎరువులు, విత్తనాల స్టాక్ బోర్డును కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. రైతులు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ డిస్ ప్లే చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయధికారి భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయధికారి సురేందర్ పాల్గొన్నారు.