Share News

నాగోబా జాతరకు కమ్మునూర్‌ గోదావరి జలాలు

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:48 AM

మండలంలోని కమ్మునూర్‌ కలమడుగు బ్రిడ్జి సమీపం లోగల గోదావరి నది ప్రాంతంలో మెస్రం వంశీయులు శుక్రవారం గోదావరి జలాన్ని ప్రత్యేకమైన ఝరిలో సేకరించి నాగోబా జాతరకు బయలు దేరారు.

నాగోబా జాతరకు కమ్మునూర్‌ గోదావరి జలాలు
గోదావరి సలాల సేకరణకు వస్తున్న మెస్రం వంశీయులు

కాళినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు

బీర్‌పూర్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కమ్మునూర్‌ కలమడుగు బ్రిడ్జి సమీపం లోగల గోదావరి నది ప్రాంతంలో మెస్రం వంశీయులు శుక్రవారం గోదావరి జలాన్ని ప్రత్యేకమైన ఝరిలో సేకరించి నాగోబా జాతరకు బయలు దేరారు. మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కేస్లాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న నాగోబా దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నాగోబా జాతరను ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటారు. ఈ నెల 28న మహాపూజతో నాగోబా జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో మెస్రం వంశీయులు, ఇతరులు మురాడి వద్దకు చేరుకొని ఈ నెల 10న ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని ఉడంపూర్‌, దస్తురాబాద్‌ మండలంలోని మల్లాపూర్‌ గోండుగూడకు ఈ నెల 16న రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం కలమడుగు గోదావరి రేవులోని అత్తమడుగు ప్రాంతానికి చేరుకొని ఆ రేవులో మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఝరిలో గంగాజలాలు సేకరించారు. తిరిగి కాలినడకన పాదయాత్రగా కేస్లాపూర్‌కు తిరిగి పయణమయ్యారు. ఈ పాదయాత్రలో పీఠాధిపతి వెంకట్‌ రావ్‌తో పాటు కటోడ దేవరావ్‌ పటేల్‌, చిన్ను పటేల్‌, జంగు, ఆనంద రావ్‌, తుకారం నాగనాథ్‌, శేఖర్‌, సీతారాం పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 12:48 AM