Kaleshwaram Project: రాహుకాలానికి ముందే కాళేశ్వరంపై నివేదిక!
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:25 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి నివేదిక
నేడు ఉదయం 9:57 గంటల్లోపు
సర్కారుకు కమిషన్ అందజేత
ఆలోపు రావాలని నీటిపారుదల అధికారులకు సమాచారం
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నివేదికను రాహుకాలం రాకముందే అందించాలని కమిషన్ నిర్ణయించింది. ఉదయం 7:15 గంటల నుంచి 9:01 గంటల మధ్య వర్జ్యం ఉండగా.. దుర్ముహూర్తం ఉదయం 9:58 నుంచి 10:45 గంటల మధ్య ఉందని, దీంతో ఉదయం 9:02 గంటల నుంచి 9:57 గంటల మధ్య నివేదికను తీసుకెళ్లడానికి రావాలంటూ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు కమిషన్ కార్యాలయం సమాచారం ఇచ్చింది. స్వతహాగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్కు రాహుకాలంపై నమ్మకం లేదు. కానీ, కమిషన్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై గత ఏడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయగా.. అదే ఏడాది జూన్ నుంచి విచారణ ప్రారంభమైంది. కమిషన్ చివరిగా గత నెల 6న ఈటల రాజేందర్ను, 9న మాజీ మంత్రి హరీశ్ను, 11న మాజీ సీఎం కేసీఆర్ను విచారించింది. విచారణ ప్రక్రియ పూర్తికావడంతో నివేదిక సమర్పించడమే త రువాయిగా మారింది. కమిషన్ నివేదిక సమర్పించడానికి ఇచ్చిన గడువు గురువారంతో ముగియనుండగా.. ప్రొటోకాల్ వంటి ప్రక్రియల కోసం ఆగస్టు 3 దాకా గడువు పెంచారు. గురువారం ఉదయం ప్రభుత్వానికి నివేదిక అందించనుండడంతో అందులో ఏముంది? బాధ్యులు ఎవరు? ఏయే చర్యలకు ఉపక్రమించాలని కమిషన్ సిఫారసు చేసింది? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.