Disabled Man: దివ్యాంగుడి సమస్యపై కదిలిన అధికారులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:40 AM
తన ఇంటికి దారి లేదని.. ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రజావాణి కార్యక్రమంలో రాజ గంగారం కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశాడు.
ముత్యంపేటలో ఆర్డీవో విచారణ
మల్లాపూర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రాజ గంగారాం అనే దివ్యాంగుడి పట్ల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అతడి సమస్య పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి మంగళవారం వెళ్లి దివ్యాంగుడు రాజ గంగారం ఇంటిని సందర్శించి అతడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
తన ఇంటికి దారి లేదని.. ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రజావాణి కార్యక్రమంలో రాజ గంగారం కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్డీవో ముత్యంపేట గ్రామానికి తహసీల్దార్ రమే్షతో కలిసి వెళ్లి రాజ గంగారాం సమస్యకు కారణాలు తెలుసుకొన్నారు. కలెక్టర్కు నివేదిక పంపిస్తానని ఆర్డీవో ఈ సందర్భంగా తెలిపారు.