Jagadish Reddy: ఆమె గురించి మాట్లాడటం వృధా అని కేసీఆర్కు చెప్పా..
ABN , Publish Date - Aug 04 , 2025 | 04:02 AM
తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ బద్ధ శత్రువుల మాటలే ఆమె మాట్లాడుతున్నారు
ఎమ్మెల్సీ కవితపై జగదీశ్రెడ్డి విసుర్లు
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి ఆమెకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఎద్దేవా చేశారు. తాను పార్టీకి సైనికుడినని, ఈ మధ్యకాలంలో కేసీఆర్ను 50సార్లు కలిసినా బనకచర్ల, వ్యవసాయ సంబంధిత అంశాలపైనే చర్చించామన్నారు. కవిత ప్రస్తావన వచ్చినపుడు ఆమె గురించి మాట్లాడటం వృధా అని చెప్పానని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నల్గొండ జిల్లాలో 25 ఏళ్లలో జరిగిన ఉద్యమాలకు, గెలుపునకు నాదే బాధ్యత అయితే.. ప్రస్తుత ఓటమికి కూడా బాధ్యుడినే. కొందరు ఏదో చేస్తామని ఊహించుకుంటున్నారు.
అది వారి భ్రమే. కేసీఆర్కు బద్ధశత్రువులుగా ఉన్నవాళ్లు, బీఆర్ఎ్సను ఖతం చేయాలని చూస్తున్నవాళ్లు అంటున్న మాటలనే ఆమె మాట్లాడుతున్నారు’’ అని విమర్శించారు. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని, వచ్చి ఉంటే స్పందించేవాడినని చెప్పారు. కేసీఆర్ లేకపోతే ఎవరూ లేమన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. తాను చావుతప్పి కన్నులొట్టబోయినట్టు గెలిచానని.. కానీ కొంతమంది గెలవనేలేదు కదా అని పరోక్షంగా కవితను విమర్శించారు.