Share News

కంపుకొడుతోంది

ABN , Publish Date - Jan 18 , 2025 | 01:11 AM

నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌ రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జిలో మురుగు నీటి నిల్వలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కంపుకొడుతోంది
మురుగునీటి సమస్యను వివరిస్తున్న స్థానికులు

కంపుకొడుతోంది

అధ్వానంగా పద్మానగర్‌ రైల్వే అండర్‌పాస్‌ బ్రిడ్జి

మురుగు నీటి నిల్వలో రాకపోకలకు అంతరాయం

35, 17వ వార్డు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

దుర్వాసన, దోమలతో సతమతం

నల్లగొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌ రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జిలో మురుగు నీటి నిల్వలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 17,35 వార్డుల మధ్యలో ఉన్న ఈ అండర్‌ పాస్‌ బ్రిడ్జీతో ప్రజల కు ఉపయోగంగా ఉండాల్సింది పోయి నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం కాకపోయినా ఎప్పుడో కురిసిన వర్షపు నీటితో పాటు సమీపంలోని మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థపు నీరు అండర్‌ పాస్‌ బ్రిడ్జీకి చేరుతుందని స్థానికులు వాపోతున్నారు. రైల్వే అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బ్రిడ్జి వ ల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా పోయే పరిస్థి తి ఏర్పడింది. వాస్తవానికి వర్షపు నీరు వచ్చినప్పుడు ఆ నీరు అండర్‌ పాస్‌ నుంచి వెళ్లిపోయే లా సమీపంలో నీటి నిల్వల కోసం ట్యాంకు ని ర్మాణం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ట్యాం కు నిర్మాణం చేపట్టినా అవుట్‌ లెట్‌ వద్ద మూసుకుపోవడంతో నీరు బయటకు పోవడం లేదు. స్థానికులు అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పద్మానగర్‌ అండర్‌ పాస్‌ బ్రిడ్జీ సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీటి నిల్వలతో నిరుపయోగంగా అండర్‌ పాస్‌

35వ వార్డులో ఉన్న రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి సమీపంలోనే 17వ వార్డు శివారు ఉంది. 35వ వార్డు నుంచి 17వ వార్డుకు అటూ ఇటూ ప్రజలు వెళ్లాలంటే ఈ అండర్‌పా్‌సను ఉపయోగించుకోవాల్సి ఉంది. అదేవిధంగా 35వ వార్డులో ఎవరైనా చనిపోయి నా వారి అంత్యక్రియలు నిర్వహించడానికి అం డర్‌ పాస్‌లో నీరు నిల్వల వల్ల అటు నుంచి వెళ్లలేక మూడు, నాలుగు కిలోమీటర్లు తిరిగి శ్మశానవాటికకు చేరుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. అండర్‌పా్‌సలోని నీటి వల్ల టూ వీలర్‌పై వెళ్లే వారు బ్రిడ్జిని ఆనుకొని ఉన్న ఎత్తు దిమ్మెపై నుంచి వెళ్తున్నారు. చాలామంది ప్రమాదవశాత్తు ఆ నీటిలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు ఏ సమయంలో ఎప్పుడూ అండర్‌పా్‌సలోకి వెళ్లి ప్ర మాదాలకు గురవుతారోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మద్యం తాగి ఆ బాటిళ్లను ఆ మురుగు నీటిలోనే వేస్తున్నారు. ఈ అండర్‌ పాస్‌ బ్రిడ్జిని ఒక వైపు నుంచి కాకుండా రెండు వైపులా కూడా నిర్మించినా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. స్థానికులు అనేక సార్లు మునిసిపల్‌ అధికారులతో పాటు, రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని సమాచారం.

నీటి నిల్వలు లేకుండా చేస్తాం

అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద అవుట్‌లెట్‌లో మట్టి లేదా ఇతర వస్తువులతో జామ్‌ కావడం వల్ల సమస్య వచ్చి ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తాం. అండర్‌ పాస్‌ బ్రిడ్జిలో నీటి నిల్వలు లేకుండా చూస్తాం.

సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌, మునిసిపల్‌ కమిషనర్‌ నల్లగొండ

దుర్వాసన, దోమలతో ఇబ్బందులు

అండర్‌పాస్‌ బ్రిడ్జిలో మురుగు నీటి వల్ల దుర్వాసనతో పాటు దోమల బెడద తీవ్రంగా ఉంటుంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. 35వ వార్డు, 17వ వార్డు ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే నీటి నిల్వలు లేకుండా చేయాలి. స్థానికంగా నివాసం ఉంటున్న తమకు దోమల బెడద నుంచి కాపాడాలి. పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. మురుగు నీటి వల్ల పాములు, తేళ్లు కూడా వస్తున్నాయి.

కృష్ణవేణి, పద్మానగర్‌

నీరు నిల్వ లేకుండా చేయాలి

మురుగు నీటిని నిల్వ లేకుండా బయటకు పోయేలా చేయాలి. అసలు అండర్‌ పాస్‌ బ్రిడ్జి వల్ల ఉపయోగం లేకుండా పోయింది. దోమల వలన రోగాల బారిన పడుతున్నాం. మురుగునీటి వాసనతో సతమతమవుతున్నా ఎవరూ స్పందించడం లేదు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇబ్బందుల నుంచి ప్రజలు బయటపడేలా చూడాలి. అనేక సార్లు ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు.

బసవయ్య, పద్మానగర్‌

Updated Date - Jan 18 , 2025 | 01:11 AM