Kavitha : కుట్రదారుడు హరీశే.. కవిత సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:38 PM
ప్రెస్మీట్లో హరీశ్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ..
హైదరాబాద్, సెప్టెంబర్ 3 : ప్రెస్మీట్లో హరీశ్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కవిత వారిద్దరి మీద సంచలన ఆరోపణలు చేశారు.
హరీష్రావు టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు చేశారు. 'రేపు కేటీఆర్కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్, హరీష్రావు ఒకే విమానంలో ప్రయాణించారు. హరీష్రావు.. రేవంత్ కాళ్లు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్రావు గురించి మాత్రం మాట్లాడరు. కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్పై సీబీఐ విచారణ చేసిందంటే.. అందుకు కారణం హరీష్రావు, సంతోష్రావే.' అంటూ కవిత ఆరోపించారు.
'కేసీఆర్తో మొదటి నుంచి హరీష్రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్రావు ప్రశ్నించారు. హరీష్రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్కు హరీష్రావు కట్టప్ప లాగా అంటారు.. హరీష్రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? ఎన్నో జన్మల పుణ్యం వల్లే కేసీఆర్కు కూతురిగా పుట్టా. కేసీఆర్ను, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా? అధికారంలో ఉన్నా, లేకున్నా.. నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా.. నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది.' అంటూ కవిత తన ప్రెస్మీట్ లో హరీశ్ రావుని టార్గెట్ చేశారు.
' వీళ్లే ఇతర రాష్ట్రాలకు వెళ్తారు.. కుట్రలు చేస్తారు. వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల సహా ఎంతోమంది పార్టీని వీడారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్రావే దగ్గరుండి గెలిపించారు. ఈ విషయాలను కేటీఆర్ గుర్తించాలి. నాకు పదవులపై ఆశ లేదు.. బయటకు వచ్చేశా. ఇప్పటికైనా హరీష్రావు నక్కజిత్తులను కేటీఆర్ గమనించాలి. హరీష్రావు చెవిలో జోరీగ వంటివారు. పార్టీలో జరిగే తప్పులన్నీ రామన్నపై మోపుతున్నారు. దళితులు మరణించిన అంశంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు. కేటీఆర్ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీష్రావు డబ్బు పంపారు.' అంటూ హరీశ్ రావు మీద కవిత సంచలన ఆరోపణలు చేశారు.