Hyderabad: హైదరాబాద్లో బీచ్!
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:50 AM
సముద్రతీరం లేని, భూపరివేష్టిత రాష్ట్రం మనది! బీచ్ కోసం ఆంధ్రప్రదేశ్కో, తమిళనాడుకో వెళ్లి ఆ ముచ్చట తీర్చుకోవాలి.
భారీ సరస్సు, ఇసుక తెన్నెలతో కాల్పానిక సముద్రతీరం
రూ.225 కోట్లతో కొత్వాల్గూడలో 35 ఎకరాల్లో ఏర్పాటు
అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, వేవ్పూల్స్, పార్కులు, సైక్లింగ్ ట్రాక్లు, ఫుడ్కోర్టులు
ఈ ఏడాది చివర్లో పనులు ప్రారంభమయ్యే అవకాశం
శంషాబాద్, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): సముద్రతీరం లేని, భూపరివేష్టిత రాష్ట్రం మనది! బీచ్ కోసం ఆంధ్రప్రదేశ్కో, తమిళనాడుకో వెళ్లి ఆ ముచ్చట తీర్చుకోవాలి. అయితే ఈ దూరభారం, వ్యయప్రయాసలేవీ లేకుండా రాజధాని హైదరాబాద్లోనే అచ్చంగా ‘సముద్ర తీరంలాంటి సముద్ర తీరం’లో విహరించే అవకాశం రానున్న రోజుల్లో పర్యాటక ప్రియులకు దక్కనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని కొత్వాల్గూడ పరిధిలో 35 ఎకరాల విస్తీరణంలో రూ.225 కోట్లు వెచ్చించి కాల్పానిక సముద్ర తీరాన్ని (ఆర్టిఫిషియల్ బీచ్) నిర్మించనున్నారు. దీని నిర్మాణం వచ్చే డిసెంబరులోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
అక్కడ.. పిల్లలు, యువత కోసం స్పోర్ట్స్, సినిమాల రూపంలో వినోదాలు.. పెద్దలు సేదతీరేలా ప్రశాంత వాతావరణాన్నీ సిద్ధం చేయాలని నిర్ణయించారు. చుట్టూ పెద్ద సరస్సు, ఇసుక తెన్నెలతో అచ్చంగా బీచ్ను తలపించే వాతావరణానికి తోడు స్పోర్ట్స్ విల్లాలు, ఫ్లోటింగ్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, పార్కులు, సైక్లింగ్ ట్రాక్లు, ఫుడ్కోర్టులు, వేవ్పూల్స్, థియేటర్లు, ఫౌంటేన్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.