Ramchander Rao: 14న నెక్లెస్ రోడ్డులో భారీ తిరంగా ర్యాలీ
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:18 AM
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 14న ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డులో కళాశాల విద్యార్థులతో...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్రావు
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 14న ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డులో కళాశాల విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్రావు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు గడచిన ఐదేళ్లుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీపరంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి. మనోహర్రెడ్డి చైర్మన్గా, ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, అధికార ప్రతినిధి రాణి రుద్రమ, బీజేవైఎం అధ్యక్షులు చేవెళ్ల మహేందర్ సభ్యులుగా ఏర్పాటయిన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగాలో భాగంగా 40 లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేస్తామన్నారు. విభజన సందర్భంగా చోటు చేసుకున్న విషాద ఘట్టాలను తెలియజేసేందుకు 14న విభజన దినంగా పరిగణిస్తామని, ఈ సందర్భంగా మౌన ర్యాలీలు నిర్వహిస్తామని రాంచందర్రావు వివరించారు.