Heavy Inflow Hyderabad Reservoirs: జంట జలాశయాలకు భారీ వరద.. అప్రమత్తమైన అధికారులు..
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:26 PM
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. రెండు జలాశయాలకు సంబంధించి 4 గేట్ల చొప్పున తెరిచారు. మూసీకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం నుంచి వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఓ గంట తర్వాత మళ్లీ భారీ వర్షం పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జన జీవనం అస్తవ్యస్తం అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. అంతేకాదు.. జంట జలాశయాలు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు భారీ వరద నీరు వచ్చి చేరింది.
దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల గేట్లను ఎత్తివేశారు. రెండు జలాశయాలకు సంబంధించి 4 గేట్ల చొప్పున తెరిచారు. మూసీకి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నేడు, రేపు హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు.
నగరంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ హై అలర్ట్లో ఉండాలని ఆదేశించారు. ఇక, తెలంగాణలోని ములుగు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్లా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్డీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
జూబ్లీహిల్స్ బైఎలక్షన్.. సునీత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్