Harish Rao: ప్యాకేజీ-6 మోటార్లను ఆన్ చేయాలి: హరీశ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:51 AM
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-6(నంది పంప్హౌస్) వద్ద ఉన్న మోటార్లను తక్షణమే ఆన్ చేసి, ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నింపాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం లేఖ రాశారు.
హైదరాబాద్/సిద్దిపేట, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-6(నంది పంప్హౌస్) వద్ద ఉన్న మోటార్లను తక్షణమే ఆన్ చేసి, ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను నింపాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం లేఖ రాశారు. మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపితే 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని, రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే నీటి పంపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోని వరద నీరు వస్తోందని, నీటిని ఎత్తిపోయడానికి ఇదే సరైన సమయమని హరీశ్ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, సిద్దిపేటలో పర్యటించిన ఆయన, రాఘవాపూర్లో యూరియా కోసం క్యూలో నిల్చున్న రైతులతో మాట్లాడారు. యూరియా కోసం రైతులు ధర్నాలు చేసే దుస్థితిని ప్రభుత్వాలు కల్పించాయని మండిపడ్డారు.