Harish Rao: ఇది కేడీల.. బేడీల రాజ్యం: హరీశ్
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:17 AM
ఇది కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం అని, సీఏం ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. కోతల రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
జిన్నారం/హైదరాబాద్, జూన్, 21 (ఆంధ్రజ్యోతి): ఇది కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం అని, సీఏం ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. కోతల రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 2 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, వారికి డబ్బులు ఇవ్వకుంటే ఔటర్ రోడ్డును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హారీశ్ రావు మట్లాడుతూ..లగచర్ల, గద్వాల జిల్లాలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి మిల్లెట్లకు, పప్పులకు తేడా తెలియదని, దేవుడు తనను పొడుగుగా ఆయనను పొట్టిగా పుట్టించారని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ అవిశ్రాంత కృషి కారణంగా వైద్య సీట్లు అసాధారణంగా పెరిగాయని హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన 410మార్కులొస్తే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.