Electric Shock: కాటేసిన కరెంటు తీగలు..
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:34 AM
కరెంటు తీగలే యమపాశాలయ్యాయి.. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఐదుగురిని బలి తీసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురంలో చోటుచేసుకున్న ఘటనలో తండ్రీకొడుకులిద్దరూ మృతి చెందగా..
వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మృతి
చనిపోయిన వారిలో తండ్రీకొడుకులు, ఓ మహిళ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): కరెంటు తీగలే యమపాశాలయ్యాయి.. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఐదుగురిని బలి తీసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురంలో చోటుచేసుకున్న ఘటనలో తండ్రీకొడుకులిద్దరూ మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన ఏనుగు నరసయ్య (56) తెల్లవారుజామున బాత్రూంకు వెళుతుండగా ఇంట్లో ఎలుకలు కొరికిన విద్యుత్తు తీగ తగిలి షాక్కు గురయ్యాడు. ఇది గమనించిన మూడో కుమారుడు ప్రవీణ్ (26), తల్లి ఎర్రమ్మ కాపాడే ప్రయత్నం చేయగా.. వారూ విద్యుదాఘాతానికి గురయ్యారు. నరసయ్య, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్రమ్మ స్పృహ కోల్పోయి పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం లింగట్లలో రైతు సాబ్లె సుభాష్ (35) తన పత్తి చేనులో కలుపు తీస్తుండగా కిందకు వేలాడుతున్న విద్యుత్తు తీగలు తగిలాయి. దీంతో షాక్కు గురైన అతడు.. అక్కడికక్కడే మరణించాడు. ములుగు జిల్లా వాజేడు మండలం మోతుకులగూడెంలో బండి రాజమ్మ (68) తన పొలంలోని చింత చెట్టును కూలీలతో నరికిస్తుండగా.. కొమ్మలు విరిగిపడి పక్కనున్న విద్యుత్తు తీగలపై పడ్డాయి. దీంతో ఆ తీగలు కింద తెగిపడగా.. కరెంట్ సరఫరా లేదనుకొని వాటిని పక్కకు తీద్దామని రాజమ్మ పట్టుకోగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. అటుగా వచ్చిన నాలుగు పశువులు సైతం ఆ తీగలను తాకి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాయి. మరో ఘటనలో.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగాపూర్కు చెందిన వ్యవసాయ కూలీ రెంజర్ల పోశెట్టి (44) కరెంటు స్తంభంపైనే మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఓ రైతు బోరు మోటార్ కరెంట్ కనెక్షన్ను సరి చేసేందుకు స్తంభం పైకి ఎక్కిన పోశెట్టికి.. అదే స్తంభంపై ఉన్న 11కేవీ వైర్లు ప్రమాదవశాత్తూ తగిలాయి. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.