Farmers Protest: పోడు రైతుల తరలింపులో ఉద్రిక్తత
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:31 AM
తాము సాగు చేస్తున్న పోడు భూములు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి
వాహనాన్ని అడ్డుకున్న ప్రవీణ్కుమార్.. అరెస్టు
కౌటాల, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తాము సాగు చేస్తున్న పోడు భూములు తమకు దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు ఎనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్న కుమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామస్థులను గురువారం అల్వాల్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని వారి స్వగ్రామానికి ప్రత్యేక బస్సులో తరలిస్తుండగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కాగజ్నగర్ సమీపంలో అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కౌటాల పోలీసు స్టేషన్కు తరలించారు.
అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. సాయంత్రం ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను పోలీసులు విడుదల చేశారు. కాగా, పోడు భూములకు పట్టాలివ్వాలని రోడ్డెక్కిన రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి టి.హరీశ్రావు ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టు చేయడాన్ని గురువారం ‘ఎక్స్’ వేదికగా ఖండించారు.