Tirumala Suicide: యూకే నుంచి కూతురు, అల్లుడిని రప్పించి..
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:33 AM
శ్రీవారి దర్శనం కోసం గురువారం భార్య అరుణ, తమ్ముడు రమేష్, మరదలితో కలిసి తిరుమలకు వచ్చారు. ఓ విశ్రాంతి భవనంలో గది తీసుకున్నారు.

తిరుమలలో దంపతుల ఆత్మహత్య
విశ్రాంత భవనంలో ఫ్యాన్కు ఉరి
కుటుంబ కలహాలతోనే అఘాయిత్యం!
తిరుమల, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తిరుపతికి చెందిన ఓ రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్, భార్యతో కలిసి శుక్రవారం తిరుమలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తిరుపతిలోని అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులు నాయుడు మూడేళ్ల క్రితం హెడ్ కానిస్టేబుల్గా వీఆర్ఎస్ పొందారు. శ్రీవారి దర్శనం కోసం గురువారం భార్య అరుణ, తమ్ముడు రమేష్, మరదలితో కలిసి తిరుమలకు వచ్చారు. ఓ విశ్రాంతి భవనంలో గది తీసుకున్నారు. సాయంత్రం దర్శనం పూర్తిచేసుకుని తిరిగి రూమ్కు చేరుకున్నారు. ముందుగా రమేష్ తన భార్యతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు నాయుడు, అరుణకు ఎన్నిసార్లు ఫోను చేసినా తీయలేదు. దీంతో అనుమానం వచ్చి తిరుపతిలో ఇంటి వద్ద ఉన్న కుమార్తె జయశ్రీ, అల్లుడు శ్రీకాంత్ శుక్రవారం మఽధ్యాహ్నం తిరుమలకు చేరుకుని గది వద్దకు వెళ్లారు. లోపల గడియపెట్టుకోవడాన్ని గమనించి రిసెప్షన్ సిబ్బందికి సమాచారమిచ్చారు. విజిలెన్స్, పోలీసులు వచ్చి గది తలుపులను గట్టిగా కొట్టి తెరిచారు. అప్పటికే శ్రీనివాసులు నాయుడు, అరుణ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. వెంటనే మృతదేహాలను అంబులెన్స్ ద్వారా తరలించారు. కాగా, యూకేలో ఉంటున్న కుమార్తె, అల్లుడిని పదిరోజుల క్రితమే ఇండియాకు రప్పించినట్టు తెలుస్తోంది. తమ చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్న సూసైడ్నోట్ పోలీసులకు లభించినట్లు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేసుకున్నారు.