Share News

ప్రభుత్వ పనితీరును విమర్శనాత్మక దృష్టితో చూడొద్దు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:52 AM

ఏడాది కాలంలో అన్ని హామీలు అమలు చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యంకాదని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పనితీరును కేవలం విమర్శనాత్మక దృష్టితో చూడడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పనితీరును విమర్శనాత్మక దృష్టితో చూడొద్దు
మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల అగ్రికల్చర్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఏడాది కాలంలో అన్ని హామీలు అమలు చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యంకాదని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పనితీరును కేవలం విమర్శనాత్మక దృష్టితో చూడడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో హామీల అమలుకు ప్రణాళికను సిద్ధం చేసి, దశల వారీగా హామీలను అమలు చేస్తుందన్నారు. ఆనాడు వైయస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ అమలు చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200 యూనిట్ల విద్యుత్‌, వంట గ్యాస్‌, ఉచిత రవాణా అమలు చేస్తుందన్నారు. బీజేపీ నాయకులు రుణమాఫీ గురించి కనీసం ఆలోచన చేయలేదన్నారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడతల వారీగా ఐదేళ్లలో రుణమాఫీ చేయగా, రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం రూ.75వేల లోపు వారికే పరిమితం చేసిందన్నారు. ఇటీవల ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రూ.2లక్షల వరకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఎకరాకు రూ.12వేల భరోసాకింద చెల్లించేందుకు క్యాబినేట్‌ నిర్ణయించడం హర్షణీయం అని, ప్రతిపక్షం సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర బాధ్యులు బండ శంకర్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మీదేవేంధర్‌రెడ్డి, బల్దియా ఫ్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, మాజీ ఎంపీపీ రమేష్‌బాబు, ప్యాక్స్‌ వైస్‌చైర్మెన్‌ శీలం సురేంధర్‌, సీనియర్‌ నాయకులు రాధాకిషన్‌రావు, గుంటి జగదీశ్వర్‌, పుప్పాల అశోక్‌, యూత్‌ కాంగ్రెస్‌బాధ్యులు భీరం రాజేష్‌ తదితరులున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:52 AM