Hyderabad crime: భార్యను ముక్కలుగా కోసి.. కుక్కర్లో ఉడికించి..
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:46 AM
కట్టుకున్న భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపి, అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడా భర్త! ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి, ఉడికించి.. ఆ ముక్కలను మూడు రోజుల పాటు ఎండబెట్టి..
ఓ భర్త దారుణం.. ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే ఘోరం
ఉడికిన ముక్కలను 3రోజులు ఎండబెట్టి.. దంచిన దుర్మార్గుడు
ఆ పొడిని చెరువులో కలిపేశాడు.. మీర్పేట్లో ఘోరం
హైదరాబాద్, జనవరి 22(ఆంధ్రజ్యోతి): కట్టుకున్న భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపి, అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడా భర్త! ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి, ఉడికించి.. ఆ ముక్కలను మూడు రోజుల పాటు ఎండబెట్టి.. రోకలితో దంచాడు! ఆ పొడిని తీసుకెళ్లి ఓ చెరువులో పడేశాడు!! ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్న ఈ ఘోరం రాచకొండ పరిఽధిలోని హైదరాబాద్ మీర్పేట్లో వెలుగుచూసింది. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే అతడింతటి ఘోరానికి పాల్పడ్డాడు. నిందితుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన 39 ఏళ్ల గురుమూర్తి! అతడి స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా తూప్రాన్. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురుమూర్తి, 13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాకే చెందిన ఉప్పాల వెంకటరమణ-సుబ్బమ్మ దంపతుల కుమార్తె వెంకట మాధవిని పెళ్లి చేసుకున్నాడు. వారికి పాప (10), బాబు (7) ఉన్నారు. రెండేళ్ల క్రితం గుర్తుమూర్తి ఉద్యోగ విరమణ చేశాడు. కంచన్బాగ్లోని ఓ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు.
కుటుంబం మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ శ్రీవెంకటేశ్వరనగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి, తరచూ గొడవపడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈనెల 13న కూడా భార్యతో గొడవపడి.. ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. కుక్కర్లో ఉడకబెట్టి, ఆ అవశేషాలను మూడు రోజుల పాటు ఇంట్లోనే ఎండబెట్టి.. దంచి.. ఆ పొడిని బకెట్లో వేసుకొని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. భార్యను హత్య చేసిన మూడు రోజుల తర్వాత 16వ తేదీన గురుమూర్తి, నగరంలోనే మరోచోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకు ఫోన్ చేశాడు. మాధవి తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని నమ్మించాడు. అదేరోజు ఆమెతో కలిసి మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా భార్యను హత్యచేయాలనే పథకంలో భాగంగానే అతడు సంక్రాంతి సెలవుల పేరుతో ఇద్దరు పిల్లల్ని తన అత్తగారింటికి పంపించాడు. మాధవి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. 16న మాధవి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయినట్లు ఏ ఫుటేజీలో కనిపించలేదు. దీంతో గురుమూర్తినే పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మాధవిని తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు తెలిసింది. దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించడం లేదు. రేపోమాపో అతడిని మీడియా ముందుకు తీసుకువచ్చి వివరాలు వెల్లడించే అవకాశమున్నట్లు తెలిసింది.