Konda Surekha: మంత్రి ఆదేశాలు బేఖాతరు.. ముగ్గురు అర్చకులపై క్రమశిక్షణా చర్యలు
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:55 AM
మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన ముగ్గురు అర్చకులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా అర్చకులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, ఇతరాత్ర కార్యక్రమాల్లో పాల్గొనవద్దని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన ముగ్గురు అర్చకులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా అర్చకులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, ఇతరాత్ర కార్యక్రమాల్లో పాల్గొనవద్దని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్ ఇటీవలే మెమో జారీ చేశారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహా వేతనాలు పొందుతున్నందున నిబంధనలు అతిక్రమించే అర్చకులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని మెమోలో స్పష్టం చేశారు. అయితే జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న విక్రాంత్ శర్మ, వెంకట కృష్ణ, కృష్ణ మూర్తి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించారన్న కారణంతో ముగ్గురు అర్చకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ కృష్ణవేణి ఆలయ ఈవోకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, సమూహ ఆలయాల ఈవో ఆర్.పురేందర్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను జములమ్మ ఆలయ ఈవోగా బదిలీ చేస్తూ అదనపు కమిషనర్ కృష్ణవేణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా గంగాపూర్ గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో ఎ.దీప్తిని జోగులాంబ ఆలయ ఈవోగా నియమించారు.