యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:57 PM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో గురువారం వైభవంగా నిర్వహించారు.

భువనగిరి అర్బన్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో గురువారం వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రవైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించారు. అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి, విశ్వక్సే నుడి తొలిపూజలతో కల్యాణతంతు కొనసాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషవస్త్రాలు, ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహించారు. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అర్చక స్వాములు నిజాభిషేకం, నిత్యార్చనలు చేపట్టారు. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు సాంప్రదాయ రీతిలో జరిగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్దతిలో నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ. 33,75,335ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ. భాస్కర్రావు తెలిపారు.