Congress Restructuring: గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:03 AM
గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నూతనంగా అబ్జర్వర్లను నియమించి, కమిటీల నిర్మాణాన్ని క్రమంగా పూర్తి చేయనుంది.

కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం
హైదరాబాద్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ నిర్మాణంలో కొత్త ప్రక్రియకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుంది. కాంగ్రె్సలో ఇన్నాళ్లూ తొలుత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, ఆ తర్వాత డీసీసీలు, మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఈ విధానానికి స్వస్తి పలికి.. గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణాన్ని మొదలు పెట్టి.. రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటుతో ప్రక్రియను ముగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒకటి, రెండు రోజుల్లో ఒక్కో జిల్లా కాంగ్రెస్ కమిటీకి(డీసీసీ) ఒకరు చొప్పున మొత్తం 35 డీసీసీలకు 35 మందిని రాష్ట్ర అబ్జర్వర్లుగా నియమించనున్నారు. అలాగే డీసీసీల నుంచి గ్రామ, మండల స్థాయిల్లో అబ్జర్వర్ల నియామకమూ చేపట్టనున్నారు. గ్రామస్థాయి అబ్జర్వర్ల పర్యవేక్షణలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఆ తర్వాత మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మండల స్థాయి కమిటీల తర్వాత డీసీసీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాతే రాష్ట్ర కార్యవర్గం కూర్పుపై అధిష్ఠానం తుది కసరత్తు చేపట్టనుంది. నిజానికి, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధుల నియామకాలపై అధిష్ఠానం వద్ద పలు దఫాలుగా చర్చలు జరిగినా.. నిర్ణయం జరగలేదు. ఇప్పుడు గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టాలని నిర్ణయించడంతో కార్యవర్గం కూర్పు మరింత ఆలస్యం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.