Share News

CM Revanth Reddy: తాగుబోతోడు జాతిపితా?

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:58 AM

తాగుబోతోడు జాతిపిత అయితడా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను జలగల్లాగా పీడించుకొని, ప్రజల రక్తం తాగినోడెవ్వడూ తెలంగాణకు జాతిపిత కారని అన్నారు.

CM Revanth Reddy: తాగుబోతోడు జాతిపితా?

ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తే ఆర్టీసీకి రూ.5 వేల కోట్లు చెల్లించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం.

- సీఎం రేవంత్‌

  • లక్ష కోట్లు దోచుకున్నోడు.. టీవీ, పేపర్లు పెట్టినోడు..

  • ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్లయితడు?

  • మహాత్ముడికి.. మందు లేనిదే లేవని కేసీఆర్‌కు పోలికా?

  • తెలంగాణ జాతిపిత.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ, జయశంకర్‌

  • పదేళ్లలో కేసీఆర్‌ రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేస్తే..

  • 15 నెలల్లో రూ.1.53 లక్షల కోట్ల అసలు, మిత్తి కట్టాం

  • కాంగ్రెస్‌ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్‌ చర్చకు రావాలి

  • బీఆర్‌ఎస్‌ నిర్మించింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం

  • సభకు రానోనికి విపక్ష హోదా.. 55 లక్షల జీతమెందుకు?

  • క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకూ చెప్పాలి

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఇక అప్పులు చేయం.. ఆదాయాన్ని పెంచి, రాష్ట్ర ప్రజలందరికీ పంచుతామని వెల్లడి

వరంగల్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తాగుబోతోడు జాతిపిత అయితడా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను జలగల్లాగా పీడించుకొని, ప్రజల రక్తం తాగినోడెవ్వడూ తెలంగాణకు జాతిపిత కారని అన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రూ.800 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడున్న ప్రజలను అడుగుతున్నా.. ఎవడయ్యా జాతిపిత? తాగుబోతోడు జాతిపిత అయితడా?’ అని మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు జాతిపిత అట. మిత్రులారా.. మన జాతిపిత గురించి మీకు తెలుసు కదా? జాతిపితకు మందు వాసన పడతదా? గుజరాత్‌లోనే మందు బంద్‌ పెట్టించిండు. జాతిపిత గాంధీజీ ఆశ్రమాల్లో ఉన్నారు. మరి ఈ జాతిపిత వాసన లేకుండా నిద్ర లేస్తడా? ఆయన చిన్నచిన్న దళితవాడల్లో గడిపితే.. ఈయన వందల ఎకరాల ఫాంహౌ్‌సలో ఉంటున్నడు. ఈయన జాతిపిత ఎట్లయితడని నేను అడుగుతున్నా. జాతిపిత అంటే ఎవరు? ఏ పదవి లేకున్నా.. ఈ దేశం కోసం, స్వాతంత్య్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం ధారపోసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీనో.. ప్రొఫెసర్‌ జయశంకరో అవుతరు. అంతేకానీ, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు.. తెలంగాణను దోచుకున్నోడు.. వందల ఎకరాల్లో ఫాంహౌ్‌సలు కట్టుకున్నోడు.. లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నోడు.. టీవీలు, పేపర్లు పెట్టుకుని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణకు జాతిపిత ఎట్లయితడని తాటిచెట్టు లాగా పెరిగినాయన (హరీశ్‌రావు)ను అడుగుతున్నా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు.


15 నెలల్లో రూ.1.53 కోట్ల అప్పులు కట్టినం

తెలంగాణ వచ్చినప్పుడు ధనిక రాష్ట్రమని.. దాన్ని కేసీఆర్‌ చేతిలో పెడితే అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆ రోజు నెలకు రూ.500 కోట్ల అసలు, మిత్తి కట్టే అప్పుంటే.. ఈ రోజు అసలుకే ప్రతి నెలా రూ.6500 కోట్లు కడుతున్నామని చెప్పారు. మొత్తంగా రూ.8.29 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. వీటికి అసలు, మిత్తి రూ.1.59 లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని చెప్పా రు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో రూ.20 లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చుకుందని, ఆ డబ్బంతా ఎక్కడికి పో యిందని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ చేసిన అప్పులకు రూ.1.53 లక్షల కోట్లు బ్యాంకులకు అసలు, మిత్తి కట్టినం. ఈ సొమ్ము ఉండుంటే 15 నెలల్లో 30 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేవాళ్లం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు లేకుండా చేసేవాళ్లం. 75 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాపీ చేసేవాళ్లం’ అని రేవంత్‌ అన్నారు. పాపాల భైరవుడు ఫాంహౌ స్‌లో రెస్ట్‌ తీసుకుంటూ, తన వాళ్లతో మమ్మల్ని తిట్టిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం, అప్పులపై ఉన్నది ఉన్నట్లుగా అసెంబ్లీలో చెబుతానని, ఆ ఆదాయాన్ని ఎలా వాడాలనేదానిపై ప్రజల సూచనలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పారు. కేసీఆర్‌ చేసిన అప్పులకు రూ.88 వేల కోట్లు అసలు, రూ.65 వేల కోట్ల మిత్తి కట్టామంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఇక అప్పులు చేయబోమన్నారు. తెలంగాణ ఆదాయా న్ని పెంచి, ప్రజలకు పంచాలనే ఆలోచనతో ఉన్నామని తెలిపారు. కేసీఆర్‌ పాపాల చిట్టా అసెంబ్లీలో చె ప్పానని, ఇది ఇంటర్వెల్‌ మాత్రమేనని; 19, 20 తేదీ ల్లో జరిగే సమావేశాల్లో ఇంకా చెబుతానన్నారు.


కేసీఆర్‌.. ప్రాజెక్టులపై చర్చకు రా..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అందులో ఒక్క కాళేశ్వరానికే రూ.1.02 లక్షల కోట్లు పెట్టిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. మూడేళ్లలోనే కాళేశ్వరం కట్టడం.. కూలడం జరిగిపోయాయని విమర్శించారు. అది కాళేశ్వం కాద ని, కూలేశ్వరమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాం లో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని బావాబామ్మర్దులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల గురించి ఈ పిల్ల కాకులకు ఏం తెలుసని ధ్వజమెత్తారు. దమ్ముంటే కేసీఆర్‌ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు, రూ.55 లక్షల జీతం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వ టీచర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు జీతం తీసుకొని విధులకు రాకుండా ఎక్కడైనా ఉంటారా? అని రేవంత్‌ అన్నారు. ‘80 వేల పుస్తకాలు చదివిన మేధావి.. జీతం తీసుకుని ఫాంహౌ్‌సలో పడుకుంటారా..? అసెంబ్లీకి వచ్చి మీ అనుభవంతో ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఎందుకు చేయ డం లేదు? క్యాప్సికం పండిస్తే కోట్ల ఆదాయం వస్తాయన్న కేసీఆర్‌.. ఆ నైపుణ్యం ఏమిటో ప్రజలకు చెప్పా లి. బయటకు రావడం ఇబ్బందైతే ఫాంహౌ్‌సకే రోజూ వెయ్యి మందిని పంపిస్తాం. ఆ నైపుణ్యం ఏంటో చెప్పాలి. నిరుద్యోగులకు ఆ నైపుణ్యాన్ని నేర్పిస్తే వారు కూడా మీలాగే సంపాదించుకుంటారు’ అని రేవంత్‌ ఎద్దేవా చేశారు.


మాకు ఉద్యోగాలు కల్పించండి సీఎం సభలో కళాకారుల నిరసన.. కుర్చీలు ఎక్కి ఫ్లెక్సీ ప్రదర్శన

స్టేషన్‌ఘన్‌పూర్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమంలో కళాకారులుగా పనిచేసిన వారిని గత ప్రభుత్వం విస్మరించగా.. ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోందని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌ సీఎం సభలో నిరసన వ్యక్తం చేశారు. సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో మహిళా కళాకారులు ఒక్కసారిగా కుర్చీల పైకి ఎక్కి వారి వెంట తెచ్చుకున్న ‘మా ఉద్యమ, నిరుద్యోగ కళాకారులకు సారథిలో ఉద్యోగాలు కల్పించాలి’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు. సీఎం వెంటనే స్పందించి.. ‘చూశాను కూర్చోండి..’ అని సూచించారు. అక్కడ ఉన్న మహిళా పోలీసులు వారిని కిందకు దింపి సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము కళాకారులుగా పనిచేశామని, గత ప్రభుత్వం రాష్ట్రంలో 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. నిజమైన కళాకారులమైన తమలాంటి 750 మందిని విస్మరించిందన్నారు.

ఇబ్బందులున్నా.. గ్యారెంటీలు అమలు చేస్తున్నాం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా.. గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తే, ప్రభుత్వం ఆర్టీసీకి రూ.5 వేల కోట్లు చెల్లించిందని చెప్పారు. అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును 50 లక్షల కుటుంబాలకు అందిస్తున్నామని, రూ.20,610 కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని వివరించారు. పది నెలల్లోనే 57,946 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 11 వేల మందికి టీచర్‌ ఉద్యోగాలు ఇచ్చామని, గ్రూపు పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించి, ఫలితాలు కూడా వెల్లడించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయానికి, ఖర్చులకు పొంతన కుదరడం లేదని, అయినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తుంటే తనను తిట్టిస్తున్నారని సీఎం చెప్పారు. కొందరు దొంగలు, తోడు దొంగలు ఉన్నారని, అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సభలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, మహబూబాబాద్‌ ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వాన్ని కూలగొట్టే యత్నాలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో రూ.లక్ష కోట్లను దోచుకుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. దోచుకున్న డబ్బులతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కర్రుకాల్చి వాత పెట్టినా బీఆర్‌ఎస్‌ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. నిజాలు బయట పడతాయనే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదని, అధికారం పోయినా వాళ్ల అహంకారం తగ్గడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో పంటలు ఎండడానికి కారణం గత పాలకులేనన్నారు. ప్రభుత్వం హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తోందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సభ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అన్నిరంగాల్లో అభివృద్ధే ధ్యేయం

నేడు, రేపు వడగాలులు.. 21-24 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు

Updated Date - Mar 17 , 2025 | 07:00 AM