Jajula Srinivas: బీసీ రిజర్వేషన్లకు పార్టీల మోకాలడ్డు: జాజుల
ABN , Publish Date - Sep 04 , 2025 | 05:15 AM
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలు మోకాలడ్డుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆరోపించారు.
బాలసముద్రం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలు మోకాలడ్డుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు నోటితో మద్దతు తెలుపుతూ నొసటితో వెక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయని, జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి రాజకీయ పార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదన్నారు.
పార్లమెంట్లో చట్టం చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూనుకోవాలని, ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయాలని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నాయకులు కేంద్రానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదని, వారి కుట్రను బీసీలు అర్థం చేసుకున్నారన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చి గవర్నర్, రాష్ట్రపతిల వద్దకు వెళ్లి బిల్లుకు ఆమోదం తెలపాలని కోరాలని కోరారు.