BC Communities: బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించేది లేదు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:51 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును అడ్డుకునే ప్రయత్నాలను సహించేది లేదని బీసీ కుల సంఘాల ప్రతినిధుల జేఏసీ స్పష్టం చేసింది.
బీఆర్ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి
ఆగస్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ
పోస్టర్ ఆవిష్కరించిన జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, పంజాగుట్ట, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును అడ్డుకునే ప్రయత్నాలను సహించేది లేదని బీసీ కుల సంఘాల ప్రతినిధుల జేఏసీ స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు అవకాశాలు రాకుండా అణగదొక్కే కుట్రలను ఎదుర్కొనేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు బీసీ కుల సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. గోవాలో ఆగస్టు 7న జరిగే జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్లను బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణే్శచారితో కలిసి సోమాజీగూడ ప్రెస్క్లబ్లో బుధవారం బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అదేపనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినా, ఆర్డినెన్స్ తెచ్చినా కోర్టుల్లో నిలవదనే గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని హితవు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపి 3 నెలలు గడిచిందన్నారు.
అయినా నేటికీ దానికి ఆమోదం తెలపకుండా బీసీలకు అన్యాయం చేస్తూ, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అంటూ తప్పించుకోవడం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం బీసీలకు అమలవుతున్న 27 శాతం రిజర్వేషన్లలో సైతం ముస్లిం సమాజం ఉన్నదని గుర్తుచేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన చాలా రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లను మత ప్రాతిపదికన అమలు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందని చెప్పారు. బీసీ వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను హరియాణా గవర్నర్ పదవి నుంచి తొలగించడం, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బీసీ సామాజిక వర్గానికి చెందినరాజాసింగ్ను బీజేపీ నుంచి బహిష్కరించడం, రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలకు అవకాశం ఇవ్వకుండా రాంచందర్రావుకు ఆ పదవి కట్టబెట్టడం బీజేపీ బీసీ వ్యతిరేక చర్యలేనని జాజుల తీవ్రంగా మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంలో పాలుపంచుకుని ఈ రోజు బీసీ రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నా చేపట్టాలని డిమాండ్ చేశారు.