Bandi Sanjay: 317జీవోపై బీజేపీ పోరాటాన్ని టీచర్లు మరువలేదు
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:08 AM
టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ర్యాలీ నిర్వహించి, కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మోదీపై నమ్మకంతోనే బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించారు: బండి సంజయ్
భగత్నగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటాన్ని ఉపాధ్యాయులు మరిచిపోలేదని, ప్రధాని మోదీపై నమ్మకంతో బీజేపీ మద్దతిచ్చిన ఎమ్మెల్సీని గెలిపించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని ర్యాలీ నిర్వహించి, కోర్టు చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహాయింపును ఎప్పటికీ మరవబోమని ప్రచారంలోనే ఉపాధ్యాయులు స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక కుట్రలు చేశాయన్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో కోట్ల రూపాయలు పంచినా ఉపాధ్యాయులు వారికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ విధానాలనే అవలంబిస్తే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కూ పడుతుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి నాయకత్వం, దిశా నిర్దేశంలో ఇది మూడో విజయమని పేర్కొన్నారు.