Harish Rao: అంగన్వాడీలకు పూర్తి జీతం చెల్లించండి
ABN , Publish Date - May 21 , 2025 | 05:58 AM
అంగన్వాడీ సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జీతాలు నిలిపివేయడం వల్ల వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వాదిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డికి హరీశ్ లేఖ
హైదరాబాద్/నంగునూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి, పూర్తి జీతం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క.. మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తిస్తూ మొదటి సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై 2023 డిసెంబరు 15న ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. 2024 జనవరి నుంచి మార్చి వరకు వారికి అంగన్వాడీ పే గ్రేడ్లో రూ.13,650 జీతం చెల్లించిన ప్రభుత్వం, ఆ తర్వాత రూ.7,800కు జీతాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. 2025 మేలో 8 జిల్లాల్లోని మినీ అంగన్వాడీలకు అంగన్వాడీ పేగ్రేడ్ జీతాలు చెల్లించి, మిగతా జిల్లాల వారికి ఇవ్వలేదని చెప్పారు. మినీ అంగన్వాడీలకు ఏడాదిగా పెండింగ్లో ఉన్న జీతాలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ హరీశ్రావు సీఎం రేవంత్కు బహిరంగ లేఖ రాశారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని, తెలంగాణకు పూర్వ వైభవం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లానాగరాజుపల్లిలో జరుగుతున్న రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో హరీశ్ పాల్గొన్నారు.