శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:57 AM
‘మీకు జరగరాని నష్టం జరిగింది...మీకు అండగా నేనుంటా.
అండగా ఉంటా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని భరోసా
హైదరాబాద్ సిటీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘మీకు జరగరాని నష్టం జరిగింది...మీకు అండగా నేనుంటా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. బాబు పూర్తిగా కోలుకునే దాకా బాధ్యత నాదే. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తాను’ అని శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు. గతనెల 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని హుటాహుటిన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. 20 నిమిషాలు అల్లు అర్జున్ ఆస్పత్రిలోనే ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వివరించారు.