జోగులాంబ ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:43 AM
అలంపూర్ జోగులాంబ ఆలయ ఉప-ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): అలంపూర్ జోగులాంబ ఆలయ ఉప-ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అర్చకుడిపై వచ్చిన విధి నిర్వహణలో నిర్లక్ష్యం, పలు ఇతర ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా జిల్లా వదిలి వెళ్లకూడదని, ఆలయానికి సంబంధించి అర్చకుడి వద్ద ఉన్న ఆభరణాలు, వస్తువులు అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సస్పెన్షన్ వేటుపై అర్చకుడు ఆనంద్ శర్మ స్పందించారు. తనపై ఏ ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారో అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనలేదని, ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని అంటూనే సస్పెండ్ చేయడం సరికాదన్నారు.