పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీ ఎప్పుడు?
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:22 AM
మంచిర్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పరిష్కారానికి నోచుకోలేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, తెలంగాణలో 2వ పీఆర్సీ, పెండింగ్ డీఏల ప్రకటన, ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీ వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
- 10వేల పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం హామీ
- 20 ఏళ్లుగా ఎస్జీటీల ఎదురుచూపులు
- మంచిర్యాలలో పదోన్నతికి నోచుకోని ఉపాధ్యాయులు
- ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకోలు
మంచిర్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పరిష్కారానికి నోచుకోలేదు. కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, తెలంగాణలో 2వ పీఆర్సీ, పెండింగ్ డీఏల ప్రకటన, ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీ వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపకపోవడంతో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యారంగంపై దృష్టిసారించడంతో ఉపాధ్యాయ లోకానికి ఊరట లభించినట్లయింది. రెండో దఫా పదోన్నతుల ప్రక్రియ సైతం కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం భాషా పండితులు, పీఈటీల ఉన్నతీకరణ చేపట్టడంతో అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆయా విభాగాలకు చెందిన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,479 పోస్టులను అప్గ్రేడ్ చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించి, ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భాషా పండితులు, పీఈటీల పదోన్నతి ప్రక్రియ కూడా పూర్తికాగా, గ్రేడ్-1 స్థానం లభించింది.
- స్థానం దక్కని ఎస్జీటీలు...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగరీల ఉపాఽధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న ప్రభుత్వం... సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీలు)కు మాత్రం స్థానం కల్పించకపోవడంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం అప్గ్రేడ్ చేసిన భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్జీటీలకు మళ్లీ స్థానం కల్పించడం లేదు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులలో 90 శాతంపైగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. అతి కొద్ది మంది మాత్రమే అర్హతలు లేని కారణంగా మిగిలిపోయారు. ఈ పోస్టులే కాకుండా అప్గ్రేడ్ చేయడం కంటే ముందున్న సుమారు వెయ్యి భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, ఎస్టీటీలకు పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదు. జీవో 11, 12లను సవరించి అర్హులైన ఎస్జీటీలతోపాటు భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులతో కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పిస్తే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆ దిశగా ఉపాఽధ్యాయ సంఘాలు కృషి చేయకపోవడంతో అర్హులైన ఎస్జీటీ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు 2017, 2024 డీఎస్సీల ద్వారా నియామకమైన గ్రేడ్-2 భాషా పండితులు సైతం స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉండటంతో 25 ఏళ్లకుపైగా సర్వీసు ఉన్నప్పటికీ అర్హులైన ఎస్జీటీలకు మాత్రం పదోన్నతులు రావడం లేదు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఎస్జీటీలకు అప్గ్రేడేషన్ ప్రక్రియలో మొండిచేయి చూపి, తమకు రావలసిన పదోన్నతులను దూరం చేశారని, అర్హతగల ఎస్జీటీలు వాపోతున్నారు. గతంలో కామన్ సీనియారిటీతో పదోన్నతులు తీసుకున్నప్పటికీ అప్గ్రేడేషన్ ప్రక్రియలో సంఘాలు ఎస్జీటీలకు మొండి చేయి చూపాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయి, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయలు అందరూ పదోన్నతులు పొందినప్పటికీ, ఎస్జీటీల కు తదుపరి అవకాశం కల్పిస్తూ జీవో సవరించడంలో కృషి చేయడంలేదని, రాష్ట్రప్రభుత్వ నిర్ణయంతో ఎస్జీటీలు ప్రభుత్వంతోపాటు యూనియన్లపై ఆగ్రహంతో ఉన్నారు. అప్గ్రేడేషన్లో అర్హత కలిగిఉన్నందున ఎస్జీటీలు తమ కు కూడా అవకాశం కల్పించాలని పోరాటం చేస్తున్నారు. అప్గ్రేడేషన్ కంటే ముందున్న ఖాళీగా ఉన్న సుమారు వెయ్యి పోస్టుల్లో కూడా న్యాయపరంగా ఎస్జీటీలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నప్పకీ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
హెచ్ఎం పోస్టుల కోసం ఎదురు చూపు..
గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 10వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు భర్తీ చేస్తే కొంతవరకైనా తమ సమస్యలు తీరుతాయనే భావనలో ఎస్జీటీలు ఉన్నారు. అలాగే ఉన్నత పాఠశాలల మాదిరిగా ప్రాథమిక పాఠశా ల్లో కూడా పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తే బోధనేతర పనులు చూసుకోవడానికి వీలు కలుగుతుందని, తద్వారా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు విద్యాబోధన మీద దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని భావి స్తున్నారు. 20 నుంచి 30 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఎలాంటి పదోన్నతులకు నోచుకోని ఎస్జీటీలకు ప్రతీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు ఇవ్వడంవల్ల పదోన్నతుల అవకాశం పెరిగి సంతృప్తి చెందుతారని భావిస్తు న్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే మంచిర్యాల జిల్లాలో దాదాపు మరో 150 మంది వరకు ఎస్జీటీలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 10వేల పోస్టులు మంజూరు చేసి ఎస్జీటీ లకు న్యాయం చేయాలని,ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి...
ఆళ్ల రాజేందర్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వెంటనే పదివేల పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయా లి. ఈ పోస్టులను అర్హతగల అందరు ఎస్జీటీలకు కేటా యించాలి. ప్రాఽథమిక పాఠశాలలను బలోపేతం చేయా లి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సుప్రీం కోర్టులో కేసు వేయడం ద్వారా న్యాయ వివాదాలను పరిష్కరిం చాలి. అప్గ్రేడ్ అయిన భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్లో జీవోలు సవరించి ఎస్జీటీలకు పదోన్నతులకు అవకాశం కల్పించాలి.