Share News

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:40 PM

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ అన్నారు.

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్‌ నరేష్‌కుమార్‌

- ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్‌ నరేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులను ఎన్నుకుంటామని ఇందుకు అధిష్ఠానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుల ఎన్నిక నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ గెస్ట్‌ హౌజ్‌లో ఉదయం డీసీసీ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని, మధ్యాహ్నం 12.30 గంటలకు సిర్పూర్‌ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13న జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌ నియోజకవర్గ సమావేశం, 14న సాధారణ ప్రజలతో పాటు మేధావుల ద్వారా అభిప్రాయాన్ని సేకరిస్తామని తెలిపారు. 19న పోటీలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్ర మం ఉంటుందని వివరించారు. జిల్లా అధ్యక్ష ఎంపి కపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, పైరవీలకు తావు లేకుండా ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రెండు జిల్లాలో పర్యటించి నివేదికను అధిష్టానానికి అందించడం జరుగుతుందని తెలిపారు. అధ్యక్షుల ప్రకటన కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, మహిళా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దిశగా కృషి చేస్తోందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించడంతో పాటు సమర్థులైన నాయకులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. పోటీల్లో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన అందరి అభి ప్రాయాలను సేకరించడంతో పాటు అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీల్లో ఉన్న వారిపై తనకు నేరుగా సలహాలు సూచనలు, ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ పరిశీలకులు శ్రీనివాస్‌, అనిల్‌కు మార్‌, జ్యోతి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణక్క, ఎమ్మెల్సీ దండె విఠల్‌, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నాయకులు శ్యాం, బాలేష్‌గౌడ్‌, మల్లేష్‌, అనీల్‌గౌడ్‌, అబ్దుల్లా, మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 11:40 PM