మాస్టర్ ప్లాన్ను పకడ్బందీగా రూపొందించాలి
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:11 PM
అమృత్ 2.0 పథకం కింద జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందుకు అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అమృత్ 2.0 పథకం కింద జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందుకు అవసరమైన వివరాలను సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంచిర్యాల, మందమర్రి మున్సిపాలిటీ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరం ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి ప్రాదేశిక వివరాలను సేకరించాలన్నారు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి భూ వినియోగ మ్యాప్లు రూపొందించాలని ఆదేశించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన ఇళ్లు, తాగునీరు, రహదారులు, ఇతర ప్రజాసేవలు ప్రణాళికాబద్దంగా అందించేందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 37.67 కిలోమీటర్ల ఏరియాలో, మందమర్రి మున్సిపల్పరిధిలో 38.98 కిలోమీటర్ల ఏరియాలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్లు సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీచేయాలని, సర్వే సమయంలో అవసరమైన మద్దతు అందించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూపొందించే జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమర్ధవంతంగా తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటీసీ సంయుక్త సంచాలకులు, నోడల్ అధికారి అశ్విని, మంచిర్యాల డీటీసీపీవో సంపత్, తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్బాలో నాణ్యమైన విద్య
మందమర్రిరూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కస్తూర్బా పాఠశాలను ఆయన పరిశీలించారు. తరగతి గదులు, పరిసరాలను, రిజిష్టర్లను, మధ్యాహ్న భోజనం నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, శుద్ధమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. కలెక్టర్వెంట డిప్యూటి తహసీల్దార్ సంతోష్, ఆర్ఐ గణపతి, ఉపాధ్యాయులు ఉన్నారు.