Share News

ఉపాధ్యాయులే తనిఖీ అధికారులు

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:08 PM

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించనుంది.

ఉపాధ్యాయులే తనిఖీ అధికారులు

- పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

- కనీస వసతులు, బోధన, హాజరు వంటివి పరిశీలన

వాంకిడి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించనుంది. ప్రస్తుతం ప్రతీ మండలంలో పాఠశాలల పర్యవేక్షణ కోసం కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ఎంఈవోలు అధికారులుగా ఉన్నారు. తాజాగా ఉపాధ్యాయులను కూడా తనిఖీ అధికారులుగా నియమించనున్నారు. కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో వారిని ఎంపిక చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అందుకోసం పదేళ్ల అనుభవం ఉన్న వారిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 4న నిర్వహించిన సమీక్ష సమావేవంలో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

- పరిశీలన ఇలా...

జిల్లాలో 526 ప్రాథమిక పాఠశాలలు, 99 ప్రాథమికోన్నత పాఠశాలలు, 60 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. తనిఖీ అధికారులుగా నియమితులైన ఉపాధ్యాయులు జిల్లా పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేస్తారు. మౌలిక వసతులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్రీడలు, డిజిటల్‌ విద్యాబోధన, విద్యార్థుల ఆరోగ్యం, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీలు, విద్యుత్‌ సౌకర్యం, క్రీడాస్థలాలు ఉన్నాయా ? లేవా? అని పరిశీలించాలి. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, యూనిఫామ్స్‌ అందుతున్నాయా? అని తెలుసుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం అమలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు వంటివి పరిశీలించాలి. డీఈవోలకు ప్రతీ నెల 5వ తేదీలోపు నివేదికలు అందించాలి. వాటిని ప్రతీ నెల కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్షిస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులు ఏడాది పాటు పనిచేస్తారు. నిబంధనల ప్రకారం జిల్లాలో పీఎస్‌ల పరిధిలో ఇద్దరు, యూపీఎస్‌ల పరిధిలో ఒకరు, ఉన్నత పాఠశాలల పరిధిలో ఒక ఉపాధ్యాయుడిని నియమించే అవకాశం ఉంది.

- నియామకం ఇలా...

- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల తనిఖీ కోసం క నీసం పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం లేదా ఎస్‌జీటీలను నియమించుకోవచ్చు. వారు నిత్యం రెండు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.

- ప్రాతమికోన్నత పాఠశాలల తనిఖీ కోసం పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌లను నియమించుకోవాలి. వీరు ప్రతీ రోజు రెండు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది.

- ఉన్నత పాఠశాలల తనిఖీ కనీసం పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి. వీరు రోజుకు ఒక పాఠశాలను మూడునెలల్లో 50 పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. దాంతో పర్యవేక్షణ పెరిగి పాఠశాలల పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది.

- పాఠశాలల వివరాలు...

ప్రాథమిక పాఠశాలలు- 526

ప్రాథమికోన్నత పాఠశాలలు- 99

ఉన్నత పాఠశాలలు- 60

Updated Date - Jun 30 , 2025 | 11:08 PM