గోదావరి తీరం వద్ద బందోబస్తు నిర్వహించాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:26 AM
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపఽథ్యంలో గోదావరి నది తీరం వైపు ఎవరు వెళ్లకుండా బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు.
గోదావరి తీరం వద్ద బందోబస్తు నిర్వహించాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపఽథ్యంలో గోదావరి నది తీరం వైపు ఎవరు వెళ్లకుండా బందోబస్తు నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నది తీరాలకు ఎవరు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించాలన్నారు. అధికారులు జిల్లాలో వరద పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. లోతట్టు, వరద ప్రబావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించామన్నారు. తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రిని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, పారిశుధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. వార్డుల్లో రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తూ అపరిశుభ్రం చేసే వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కాలేజీ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను, పాత మంచిర్యాలలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎంవోలు భీష్మ, శ్రీధర్, తహసీల్దార్ రఫతుల్లా, సీఐ ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
రహదారుల మరమ్మతు పనులను చేపట్టాలి
భీమారం (ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. భీమారం మండలంలోని బూరుగుపల్లి నుంచి దాంపూర్కు వెళ్లే దారిలో గర్రెపల్లి సమీపంలో దెబ్బతిన్న రహదారిని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను పరిశీలించి త్వరగా పనులు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, శుద్ధమైన నీటిని అందించాలన్నారు. ఆహారం తయారీ సమయంలో పరిశుభ్రత నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం కస్తూర్బాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.