ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:18 PM
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషకరించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామానికి చెందిన పోతిని చిన్నవెంకటస్వామి తనకు గల భూమిలో అయిల్పామ్ సాగు చేస్తున్నాని ఉత్పత్తి అయినందున విక్రయించేందుకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు అందజేశారు. పెంచికలపేట మండల కేంద్రానికి చెందిన పాముల నందు తాను గతంలో ఎల్లూరు గ్రామ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
కాగజ్నగర్ పట్టణం ద్వారకానగర్ కాలనీకి చెందిన కత్తెరపాక ప్రమీల తనకు గతంలో ఆసరా పెన్షన్ వచ్చేదని ఆరు సంవత్సరాలుగా రావడంలేదని ఇప్పించాలని కోరారు. లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ అనూష బాయి తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన పాలకుర్తి సంతరక్క తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. బెజ్జూరు మండలం సోమిని గ్రామానికి చెందిన లింగయ్య తన భూమి ధరణి పోర్టల్లో ఇరుల పేరిట పట్టా అయినందున సరవరించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
కాగజ్నగర్ పట్టణంలోని న్యూకాలనీకి చెందిన కామెర మాధవి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, రెబ్బెన మండలం కొండపల్లి బుద్దనగర్ కాలనీలో తాము 20 కుటుంబాలు నివాసం ఉంటున్నామని తమకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. తిర్యాణి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన టేకం పోసుబాయి తాను ఐదో తరగతి వరకు చదివానని, కిరాణా షాపు ఏర్పాటు కోసం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ, గ్రామీణాభివృద్ధి సంస్థలో మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నానని రుణం మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీదారులు పాల్గొన్నారు.