Share News

సమస్యలను త్వరగా పరిష్కరించాలి

ABN , Publish Date - May 12 , 2025 | 11:21 PM

: ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను అధికార యంత్రాంగం సమన్వయంతో త్వరగా పరిష్కారం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌తో కలిసి సోమవారం అర్జీలను స్వీకరించారు.

సమస్యలను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను అధికార యంత్రాంగం సమన్వయంతో త్వరగా పరిష్కారం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌తో కలిసి సోమవారం అర్జీలను స్వీకరించారు. చెన్నూర్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన చల్ల రాజు తాను రిజిస్ర్టేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన భూమి నుంచి కొంత భూమి గొల్లవాగు కాలువలో ముంపునకు గురైందని, ఈ భూమికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. బెల్లంపల్లి మండలం పెద్దనపల్లికి చెందిన అన్నపూర్ణ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దరఖాస్తు చేసుకున్నానని, కూలీ పనిచేసే తన భర్తకు ప్రభుత్వం ఉద్యోగం ఉన్నట్లు జాబితాలో చూపించారన్నారు. తాండూర్‌ మండలం గోపాలరావుపేటకు చెందిన కాసిపాక లక్ష్మీ తనకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు ఉందని తాను ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. మంచిర్యాల పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన భీమన్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు చేపట్టానని బిల్లు ఇప్పించాలన్నారు. దండేపల్లి మండలం పాతమామిడిపల్లికి చెందిన ఆరె సత్తయ్య తన తండ్రి పేరిట భూమి ఉందని, ఆయన మరణం తరువాత కొందరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నా లు చేస్తున్నారని విన్నవించారు. ఈ భూమిని తన తల్లి పేరిట పట్టా మార్పిడి చేయాలని కోరారు. హాజీపూర్‌ గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నామని, ఈ గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం అయినందున తమకు ఉపాధి కల్పించాలని విన్నవించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని గద్దెరాగడి ప్రాంత వాసులు కాలనీలో రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని, రోడ్డు నిర్మించాలని కోరారు. మంచిర్యాల పట్టణం తిలక్‌ నగర్‌లో గర్మిళ్ళ శివారులో గతంలో కొనుగోలు చేసిన ప్లాట్లను తన భూమి అని ఓ వ్యక్తి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధితులు కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫోటోరైటప్‌

108జైపూర్‌12 షెట్‌పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

జైపూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ నిర్వాహకులకు సూచించారు. సోమవారం మండలంలోని షెట్‌పల్లి, నర్సింగాపూర్‌, కుందారం, కిష్టాపూర్‌, పౌనూరు, శివ్వారం, వేలాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహకులకు పలు సూచన లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, నీడ, సౌకర్యాలు కల్పించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైసు మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం ఇందారం గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ఏర్పాటుకు తహసీల్దార్‌ వనజారెడ్డితో కలిసి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో ఏపీఎం రాజ్‌కుమార్‌, ఆర్‌ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:22 PM