కనీస అభ్యసన సామర్థ్యాలు ఉండాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:24 PM
ప్రతీ విద్యార్థి విషయాల వారీగా కనీస అభ్యసన సామర్థ్యాలతో పాటు డిజిటల్ సామర్థ్యాలను, 21వ శతాబ్దపు నైపుణ్యాలను సాధించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ సూచించారు.
- జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్
ఆసిఫాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థి విషయాల వారీగా కనీస అభ్యసన సామర్థ్యాలతో పాటు డిజిటల్ సామర్థ్యాలను, 21వ శతాబ్దపు నైపుణ్యాలను సాధించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్ సూచించారు. ఆసిఫాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. సాంఘిక శాస్త్రం, ఆంగ్లం విషయాలకు సంబంధిం చిన డిజిటల్ సామర్థ్యాలను, 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం ‘ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా డివిజనల్ లోని సాంఘికశాస్త్రం, ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో సామాన్య పౌరులు రకరకాల యాప్లు, బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్లు, లింకులు క్లిక్ చేయడం ద్వారా మోసానికి గురవుతున్నారన్నారు. ఉపాధ్యాయులు ఈ అంశాలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏ బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్లోని ప్రతీ అంశాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి చేరేలా విద్యాబోధన చేయాలని ఆదేశించారు. ఆంగ్ల ఉపాధ్యాయులు డిజైన్ ఆలోచన, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు డిజిటల్ పౌరసత్వంనకు సంబంధించిన అంశాలు పాఠ్య ప్రణాళికల ప్రకారం బోధించాలని సూచించారు. సమావేశంలో ఆర్పీలు రాజు, విజేష్, ఉపాధ్యాయులు తులసీరాం, ఊశన్న, ప్రిన్సిపాల్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.