జీవో నంబర్ 49 రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:26 PM
కుమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 49ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితీ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కదం తొక్కారు.
- కదం తొక్కిన ఆదివాసీలు
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆసిఫాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం కన్జర్వేషన్ రిజర్వ్ పేరిట ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 49ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితీ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కదం తొక్కారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు పిలుపునివ్వడంతో జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరి నిరసన కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కుమరంభీం చౌక్లోని కుమరంభీం విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకొని మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్కుమార్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు, మాజీ జడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కి దొంగదారిన జీవో 49ని తీసుకు వచ్చిందన్నారు. ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే హక్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. జీవో 49ని రద్దు చేసే వరకు నిద్రపోమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే జీవో 49ని రాష్ట్రప్రభుత్వం నిలుపుదల చేసిందని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కుమరంభీం, రాంజీగోండు, బీర్సాముండా స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు మాట్లాడుతూ జీవో 49 తీసుకురావడంలో కేంద్రప్రభుత్వ ప్రమేయం లేదన్నారు. ఎలాంటి గ్రామసభలు, తీర్మానాలు లేకుండానే దొడ్డి దారిన రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందడానికే జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేసిందని ఇది కంటి తుడుపు చర్య అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో జీవో 49పై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. జీవో రద్దు చేసేంత వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, ఆగస్టు 4న కాగజ్నగర్ పట్టణంలోని ఫారెస్టు కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ఆదివాసీలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో గేట్లు తీయాలని ఆదివాసీలు తోసే ప్రయత్నం చేయగా పోలీసులు వీరిని అడ్దుకున్నారు. దీంతో గేటు ఎదుట బైఠాయించి కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల నాయకులు కోవ విజయ్, గణేష్, ప్రభాకర్, మాంతయ్య, మడావి శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు అరిగెల మల్లిఖార్జున్, కొప్పుల శంకర్, వామపక్ష పార్టీల నాయకులు శ్రీనివాస్, దినకర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.