Share News

సీఎంఆర్‌ అనుమతులు పొందేదెలా?

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:45 PM

జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యాన్ని సీఎంఆర్‌ (కస్టమ్‌మిల్లింగ్‌రైస్‌) కోసం అధికారులు రైస్‌ మిల్లులకు పంపుతారు. గతంలో సీఎంఆర్‌కింద ధాన్యం పొందినమిల్లర్లు పెద్దమొత్తంలో వాటిని పక్క దారి పట్టించగా, పరిశీలించిన జిల్లా ఉన్నతాధి కారులు సంబంధిత రైస్‌మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

సీఎంఆర్‌ అనుమతులు పొందేదెలా?

- జోరుగా రైస్‌ మిల్లర్ల పైరవీలు?

- గతంలో 25 మిల్లులపై క్రిమినల్‌ కేసులు

- ఈయేడు ధాన్యం ఇచ్చేందుకు అధికారుల ససేమిరా

మంచిర్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ధాన్యాన్ని సీఎంఆర్‌ (కస్టమ్‌మిల్లింగ్‌రైస్‌) కోసం అధికారులు రైస్‌ మిల్లులకు పంపుతారు. గతంలో సీఎంఆర్‌కింద ధాన్యం పొందినమిల్లర్లు పెద్దమొత్తంలో వాటిని పక్క దారి పట్టించగా, పరిశీలించిన జిల్లా ఉన్నతాధి కారులు సంబంధిత రైస్‌మిల్లులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. గత సంవత్సరం నుంచి కేసులు ఎదుర్కొంటున్న మిల్లులకు సీఎంఆర్‌ కోటాను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. రైతులనుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాల్సి ఉంది. ఈ ఏడాది ఎలాగైనా ీసీఎంఆర్‌ పొందాలనే ఉద్దేశంతో మిల్లర్లు శథవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి సాగు గణనీయంగా పెరగడం, పలు మిల్లులపై క్రిమినల్‌ కేసులు ఉన్నందున ధాన్యం ఎక్కడ నిల్వ చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 54 రైస్‌ మిల్లులు ఉండగా, వాటిలో బాయిల్డ్‌-19, రా రైస్‌ మిల్లులు 35ఉన్నాయి. యాసంగి ధాన్యం నిల్వ లకోసం రైస్‌ మిల్లులకు జియో ట్యాగింగ్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే సీఎంఆర్‌ ఇవ్వని 25 మిల్లులపై అధి కారులు కేసులు బుక్‌ చేశారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం ఆయా మిల్లుల యజమానుల నుం చి ధాన్యం సొమ్మును కూడా కొంతవరకు రికవరీ చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వవద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు వాటిని పక్కన బెట్టక తప్పని పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు సీఎంఆర్‌ పెండింగులో ఉన్న రైస్‌ మిల్లులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో ధాన్యం ఎక్కడ దించుతారోనన్న సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభమైనందున ఇప్పటి వరకు 14 మిల్లులకు జియో ట్యాగింగ్‌ ఇచ్చారు. జిల్లాలో సేకరించిన ధాన్యాన్ని అవసరమైతే ఇతర జిల్లాలకు తరలించైనా నిల్వ చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పంట దిగుబడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున మరిన్ని మిల్లులకు అనుమతులు ఇవ్వడం తప్పనిసరి. సీఎంఆర్‌ బకాయిపడ్డ మిల్లర్లు నిర్ణీత గడువులోగా 40 శాతం మేర తిరిగి అప్పగించి, మిగతా దానికి బ్యాంక్‌ గ్యారెంటీ ఇస్తే జియో ట్యాగింగ్‌ ఇచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

- పెరిగిన వరి సాగు...

గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి యాసంగి సీజన్‌లో వరి సాగు జిల్లాలో గణనీయంగా పెరి గింది. జిల్లాలో లక్షా 21వేల 702 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో దొడ్డురకం లక్షా 14 వేల 774 ఎకరాలు కాగా, సన్నరకం 6,928 ఎకరాల్లో సాగైంది. ఈ సీజన్‌లో మూడు లక్షల 40వేల 301 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో దొడ్డు రకం మూబు లక్షల 23వేల 639 మెట్రిక్‌ టన్నులు, సన్నరకం ధాన్యం 16,662 మెట్రిక్‌ టన్నులు వస్తుందని భావిస్తు న్నారు. ధాన్యం కొనుగోలు కోసం యాసంగి సీజన్‌ లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 361 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 332 కేంద్రాలను ప్రారంభించగా, 85 కేంద్రాల ద్వారా 17,019 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

- బ్యాంకుల చుట్టూ మిల్లర్ల ప్రదక్షిణలు...

ప్రభుత్వానికి సీఎంఆర్‌ ఎగొట్టి మళ్లీ అనుమతులు పొందేందుకు మిల్లర్లు నానా తంటాలు పడుతున్నారు. సీఎంఆర్‌ బకాయిల్లో 40 శాతం తిరిగి అప్పగిస్తుండగా, మిగిలిన దానికి గడువులోగా బ్యాంక్‌ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు మిల్లులపై క్రిమినల్‌ కేసులు ఉండగా, అవే మిల్లులకు గ్యారెంటీ ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకుల చుట్టూ మిల్లర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగైనా సీఎంఆర్‌ అనుమ తులు పొందాలనే పట్టుదలతో ఉన్న పలువురు మిల్లర్లు సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొనే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలోగల రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో యజమానులు ఇటీవల భారీ ఎత్తున దావత్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ట్యాగింగ్‌ రాని పలువురు మిల్లర్లు నిత్యం కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతూ అనుమతులు తెచ్చుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈక్రమం లో సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టించి, డీఫాల్ట్‌లో ఉన్న మిల్లులకు తిరిగి ధాన్యం కేటాయించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - Apr 29 , 2025 | 11:45 PM