ఈఎస్ఐ భవన నిర్మాణానికి కృషి
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:49 PM
కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనం మంజూరు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు తెలిపారు.
- ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు
కాగజ్నగర్ టౌన్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): కాగజ్నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనం మంజూరు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు తెలిపారు. సోమవారం పట్టణంలోని శిథిలావస్థకు చేరిన ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఒకప్పుడు పట్టణంలో వేలాది మంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించిన ఈఎస్ఐ ఆసుపత్రి ప్రస్తుతం వెలవెలబోతుందని, భవనం సైతం శిథిలావస్థకు చేరిందన్నారు. నూతన భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈఎస్ఐ నూతన భవన నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. ఆసుపత్రి ఇతర భవనంలోకి తరలించి శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చి వేసి 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టను న్నట్లు వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట నాయకులు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు.
సామాజిక స్పృహ కలిగిన అభ్యర్థులను గెలిపించండి
దహెగాం: సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు సూచించారు. దహెగాం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని, అలాగే జాతీయ ఉపాధిహామీ పథకం కింద సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించేది కూడా కేంద్ర ప్రభుత్వమే నని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ఎనలేని కృషి చేస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద బీటీ రోడ్లు వేయనున్నామని తెలిపారు. పీపీ రావు కాలనీ నుంచి సుర్దాపూర్ వరకు వయా హత్తిని మీదుగా హమ్ పథకం ద్వారా రోడ్డు మంజూరు అయిందని త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. కల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, తిరుపతి, దామోదర్, శ్రీనివాస్గౌడ్, శంకర్గౌడ్, వినోద్, శ్రీకాంత్, హరీష్గౌడ్, అరవిందగౌడ్, వెంకటేష్, సత్యం, ప్రదీప్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి): బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. సోమవారం మండలంలోని అచ్చెల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధికి పాటు పడుతామని అన్నారు. ఆరెగూడలో రూ.2.50 కోట్లతో సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులు త్వరలోనే చేపడాతమని తెలిపారు. అంతకుముందు గ్రామస్థులు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట నాయ కులు శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.