పత్తి, వరి కొనుగోళ్లు సమర్థవంతంగా చేపట్టాలి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:21 PM
ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రైతులు సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తగుచర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.
- మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఆసిఫాబాద్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇందులో భాగంగా రైతులు సాగు చేసిన పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తగుచర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పత్తి, వరి కొనుగోలు ప్రక్రియ రాష్ట్రంలో సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని, సరిహద్దు వద్ద అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయ, రవాణా, మార్కెటింగ్, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి కొనుగోలు కోసం 40 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తైన ప్రదేశాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు, ట్యాబ్లు, టార్పాలిన్లు, అందుబాటులో ఉంచామని వివరించారు. తాగునీరు, నీడ, మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. పత్తి కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, రవాణాధికారి రాంచందర్, పౌరసరఫరాల అఽధికారి అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.