బడి బస్సులు భద్రమేనా?
ABN , Publish Date - May 28 , 2025 | 11:41 PM
విద్యాసంస్థల బస్సుల్లో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. ఫిట్నెస్లేని బస్సులు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. విద్యా సంస్థల బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.
- నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులు
- ఫిట్నెస్ లేకున్నా రోడ్లపైకి వాహనాలు
- నామమాత్రంగా రక్షణ చర్యలు
- ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో వెల్లడి
మంచిర్యాల, మే 28 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల బస్సుల్లో యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేస్తున్నాయి. ఫిట్నెస్లేని బస్సులు నడుపుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. విద్యా సంస్థల బస్సుల్లో పిల్లల రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ తనిఖీ సమయాల్లో నిబంధనలు పాటిస్తున్నప్పటికీ, ఆ తరువాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జూన్ 12 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుండగా, ఆ లోపే విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోవలసి ఉంది. మూడు రోజులుగా ఆర్టీఏ అధికారులు బస్సుల తనిఖీలు చేపడుతుండగా, యాజమాన్యాల నుంచి సరియైన స్పందన లభించడంలేదు. జిల్లావ్యాప్తంగా 380 విద్యాసంస్థల బస్సులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 35 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఫిట్నెస్ పరీక్షలకు వెళితే అధికారులు బస్సులను సీజ్ చేస్తారేమోననే ఉద్దేశంతోనే వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల తనిఖీల్లో అనేక బస్సుల్లో లోపాలు బయటపడుతుండటం గమనార్హం.
గ్రిల్స్ తప్పనిసరి...
బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రత కోసం బస్సుకు మూడు వైపులా తప్పనిసరిగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ముఖ్యంగా పాఠశాలల బస్సుల్లో ప్రయాణించేది చిన్నపిల్లలు కావడంతో బస్సు కదిలేటప్పుడు కిటికీల నుంచి చేతులు బయటకు చాచకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. గ్రిల్స్ లేని కారణంగా ప్రయాణ సమయంలో విద్యార్థులు చేతులు బయట పెట్టిన పక్షంలో ఇతర వాహనాల ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది.
నామమాత్రంగా ఫైర్ ఎస్టింగిషర్లు?
అనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం సంభవించి బస్సు లో మంటలు చెలరేగిన పక్షంలో వాటిని ఆర్పేందుకు ఫైర్ ఎస్టిం గిషర్లు అందుబాటులో ఉండాలి. అగ్నిమాపక శాఖ నుంచి అను మతి తీసుకొని బస్సుల్లో ఫైర్ ఎస్టింగిషర్లు ఏర్పాటు చేయాలి. అయితే బస్సులో ఫైర్ ఎస్టింగిషర్స్ కనిపిస్తున్నప్పటికీ, నామ మాత్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయాల్లో అవి పని చేస్తాయో..జలేదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి.
ప్రథమ చికిత్స డబ్బాలో కానరాని పరికరాలు..
విద్యాసంస్థల బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అందులో ప్రథమ చికిత్సకు సంబంఽధించి ఎలాంటి పరికరాలు ఉండటం లేదని తెలుస్తోంది. ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో తప్పనిసరిగా కాటన్, అయోడిన్, స్పిరిట్ బాటిల్, బ్యాండేజ్ ఉండాలనే నిబంధన ఉంది. బస్సుల్లో తదితర వస్తువులు ఉన్న ప్పటికీ అవి కాలం చెల్లి ఉండటం గమనార్హం. చిన్నచిన్న ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉపయోగపడతాయి. వీటితో పాటు విద్యార్ధులు బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డ్రైవరుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఫోటో పేరు, సెల్ నంబర్ విధిగా ప్రదర్శించాలనే నిబంధన ఉంది.
ఊసేలేని డ్రైవర్ల మెడికల్ సర్టిఫికెట్లు..
పాఠశాల బస్సుల్లో పనిచేసే డ్రైవర్లకు రెండు సంవత్సరాలకు ఒకసారి వైద్య చికిత్సలు చేయించి మెడికల్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంచాలి. కాని ఈ విషయమై యాజమాన్యాలు దృష్టి సారించడంలేదని సమాచారం. డ్రైవర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు యాజమాన్యాలు ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలనే నిబంధన కూడా ఉంది. లైట్లు, హ్యాండ్ బ్రేక్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్లు, పసుపుపచ్చ రంగు కలిగి ఉండాలి.
ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి: రంజిత్, ఎంవీఐ
జిల్లాలో సుమారు 400 బస్సులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 35 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. జూన్ 12 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం ఉ న్నందున యాజమాన్యాలు స్పందించాలి. నిర్ణీత గడువులోగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాము.