ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:14 PM
ప్రజాప్రభుత్వంలో మోసాలకు పాల్పడే వారికి తావు లేదని ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి హెచ్చరించారు.
- ఎవరైనా మీ సేవలో బుక్ చేసుకోవాల్సిందే..
- రాష్ట్ర మంత్రి వివేక్వెంకటస్వామి
జైపూర్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వంలో మోసాలకు పాల్పడే వారికి తావు లేదని ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందా సాగిందని, అప్పటి బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోపిడీ చేశారన్నారు. తాను మైనింగ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల ఇసుక దందా ఆపాలని ఆదేశించానని తెలిపారు. ఎవరు ఇసుక దందా చేసినా ఊరుకునేది లేదని, ఆన్లైన్ ద్వారానే ఇసుక సరఫరాకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరు ఇసుక కోసం మీ సేవలో బుక్ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా ద్వారా రాష్ట్ర సర్కార్ తొమ్మిది రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రిక్కుల శ్రీనివాస్రెడ్డి, ఫయాజ్, విశ్వంభర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట
చెన్నూరు (ఆంధ్రజ్యోతి): చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య, రహదారుల మరమ్మతులు, పింఛన్లు, భూ సంబంధిత సమస్యలు, ఇతర అభివృద్ధి సమస్యలను పై మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. అనంతరం పట్టణంలో రూ. 37 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. మండలంలోని సుబ్బరాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. రైతు వేదికలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.