Chityala Traffic Jam: చిట్యాలలో 6 కి.మీ. ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:26 AM
మూడు రోజుల వరుస సెలవులు ముగియడంతో.. విజయవాడ-హైదరాబాద్ జాతీ య రహదారిపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం..
విజయవాడ -హైదరాబాద్ రహదారిపై తీవ్ర రద్దీ
చిట్యాలరూరల్, చౌటుప్పల్ టౌన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మూడు రోజుల వరుస సెలవులు ముగియడంతో.. విజయవాడ-హైదరాబాద్ జాతీ య రహదారిపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 11.30 గం టల వరకూ వాహనాలరద్దీ విపరీతంగా పెరిగింది. ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు వాహనాలు బారులు తీరాయి. అసలే వాహనాల రద్దీ.. దానికి తోడు వర్షం, కారుమేఘాలతో ఆవరించిన చీకటి.. ఇవన్నీ చాలవన్న ట్టు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రయాణవేగం బాగా మందగించింది. చిట్యాల నుంచి 6 కి.మీ. దూరంలోఉన్న పెద్దకాపర్తికి వెళ్లడానికి ఒక్కో వాహనానికీ 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఆ 6కి.మీ. మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పోలీసులు ఎన్హెచ్ఏఐ సిబ్బందితో కలిసి వాహనాలను సర్వీ్సరోడ్డు మీదుగా మళ్లించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత కూడా.. చౌటుప్పల్ మీదుగా ఔటర్రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ కొనసాగిందని వాహనదారులు తెలిపారు.